ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఆర్డీఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి
ఎల్బీనగర్:
కందుకూరు రెవెన్యూ డివిజన్ సరూర్ నగర్ మండలం పరిధిలోని క్రాంతి నగర్, వెంకటేశ్వర కాలనీ, ఆర్కేపురం డివిజన్ పరిధిలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఆర్డీఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్ తో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేస్తున్న తీరును, ఎన్యూమరేషన్ ఫారాలను,ఆయన తనిఖీ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని బీఎల్వోలకు సూచించారు. ప్రతి ఇంటిని తప్పకుండా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరు వివరాలను నమోదు చేయాలని, అనర్హుల వివరాలను నిబంధనల ప్రకారం గుర్తించాలని తెలిపారు.ఓటర్ల నుంచి వచ్చే దరఖాస్తులు, అభ్యంతరాలను, నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో సంబంధిత ఎన్నికల ఈఆర్ఓ శ్రీనివాస్ రావు, ఆర్ఐ జ్యోతి సూపర్ వైజర్స్ నవీన్, ప్రభాకర్ స్థానిక బీఎల్వోలు పాల్గొన్నారు.


