సరూర్నగర్ చెరువు కట్టపై డ్రోన్ కెమెరాతో పోలీసుల నిఘా
ఎల్బీనగర్:
సరూర్నగర్ చెరువు కట్ట ప్రాంతంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు డ్రోన్ కెమెరా ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహించారు. వారాంతాల్లో, సాయంత్రం వేళల్లో చెరువు కట్ట వద్దకు అధిక సంఖ్యలో ప్రజలు, యువత చేరుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ చర్యలు చేపట్టారు.డ్రోన్ కెమెరా సహాయంతో చెరువు కట్ట పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం, ప్రమాదకరంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ప్రజలు పోలీసులకు సహకరించి చెరువు కట్ట వద్ద ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ శ్రీశైలం, ఎస్ఐ లక్ష్మణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
