తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం దన్నుగా నిలవాలి.

  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి.
  • *గోదావరి జలాలు, మెట్రో రెండో దశ, ప్రాంతీయ వలయ రహదారి, వరంగల్ విమానాశ్రయం, ఐఐఎంలపై సమగ్ర నివేదిక

తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం దన్నుగా నిలవాలి.

హైదరాబాద్: 

తెలంగాణ రాష్ట్ర ప్రగతికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రితో సమావేశమైన ముఖ్యమంత్రి, రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను వివరిస్తూ పలు విజ్ఞప్తులతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించారు.

*గోదావరి జలాల సమర్థ వినియోగం
రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను గరిష్ఠంగా ఉపయోగించుకోవడం తెలంగాణకు అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి వివరించారు. నదీ జలాల సమర్థ వినియోగానికి వీలుగా పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాలని, అవసరమైన సహకారం అందించాలని కోరారు.WhatsApp Image 2026-06-11 at 20.18.41 (1)

*రూ. 38,595 కోట్లతో మెట్రో రెండో దశ
హైదరాబాద్ మహానగర రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు ప్రతిపాదించిన మెట్రో రైలు రెండో దశ విస్తరణకు తక్షణమే ఆమోదం తెలపాలని రేవంత్‌రెడ్డి కోరారు. రెండో దశలో భాగంగా మొత్తం 7 మార్గాల్లో (కారిడార్లలో) 122.9 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించేందుకు రూ. 38,595 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్య (జాయింట్ వెంచర్) పద్ధతిలో మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

*ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి
హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదించిన ప్రాంతీయ వలయ రహదారి (రీజినల్ రింగ్ రోడ్) పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

 *ఉత్తర భాగం: ఈ మార్గంలో భూసేకరణ ఖర్చులో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, అందుకోసం జాతీయ రహదారుల సంస్థకు (ఎన్‌హెచ్‌ఏఐ) రూ. 626 కోట్లు విడుదల చేసినట్లు ప్రధానికి వివరించారు. ఇక్కడ ఇప్పటికే 90 శాతానికి పైగా భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని స్పష్టం చేశారు.

 *దక్షిణ భాగం: చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు నిర్మించే దక్షిణ మార్గం కూడా అంతే కీలకమని, ఇది పూర్తయితే హైదరాబాద్ చుట్టూ రవాణా అనుసంధానత మరింత బలోపేతమవుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన మార్గ సూచీ (అలైన్‌మెంట్) పటాలు, హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) ప్రకటనలను ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు సమర్పించామని, ఉత్తర, దక్షిణ మార్గాలను ఒకేసారి ఆమోదించి అమలు చేయాలని కోరారు.

*సముద్ర తీరం లేని లోటు తీర్చే ‘ఎక్స్‌ప్రెస్‌వే’
హైదరాబాద్–అమరావతి–బందర్ రేవులను అనుసంధానిస్తూ ప్రతిపాదించిన 12 వరసల (లేన్ల) వేగవంతమైన రహదారికి (ఎక్స్‌ప్రెస్‌వే) కేంద్రం అనుమతులు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 120 మీటర్ల రహదారి హక్కు (రైట్ ఆఫ్ వే) తో నిర్మించే ఈ రహదారి ద్వారా, సముద్ర తీరం లేని తెలంగాణకు ఓడరేవు అనుసంధానత లభిస్తుందని వివరించారు. ఇది రాష్ట్రంలోని ఔషధ (ఫార్మా), విద్యుత్ పరికరాల (ఎలక్ట్రానిక్స్), ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) రంగాల ఎగుమతులకు వ్యూహాత్మక మార్గంగా మారుతుందని పేర్కొన్నారు.
## వరంగల్ విమానాశ్రయం.. హైదరాబాద్‌కు ‘ఐఐఎం’
ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాల అభివృద్ధికి వరంగల్ విమానాశ్రయం అత్యంత అవసరమని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దీనికి అవసరమైన భూసేకరణ పూర్తి చేసి విమానాశ్రయాల అధికార సంస్థకు (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ) అప్పగించామని, పనులను త్వరగా ప్రారంభించాలని కోరారు.
మరోవైపు, హైదరాబాద్‌లో భారతీయ నిర్వహణ శాస్త్ర సంస్థ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. ఇందుకోసం 200 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, టిఐఎఫ్ఆర్ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యాసంస్థలు ఉన్నాయని, ఐఐఎం కూడా వస్తే నూతన విద్యావిధానం-2020 లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రికి వివరించారు.WhatsApp Image 2026-06-11 at 20.18.41

About The Author