తెలంగాణలో కొత్త రైల్వే లైన్
పటాన్చెరు-ఆర్మూర్-ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ పనులను ప్రారంభించడానికి కేంద్ర రైల్వే శాఖ సిద్ధమైంది
తెలంగాణ ట్రైన్ ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్కు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం పటాన్చెరు-ఆర్మూర్-ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ పనులను ప్రారంభించడానికి కేంద్ర రైల్వే శాఖ సిద్ధమైంది. 250 కి.మీ.ల ఈ మార్గం.. ఆదిలాబాద్ నుంచి నగరానికి 72 కి.మీ. దూరాన్ని తగ్గిస్తుంది, సమయం, ఖర్చూ ఆదా చేస్తుంది. ఇది నిర్మల్, నిజామాబాద్, బోధన్, సంగారెడ్డిలను కలుపుతూ పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుంది.
తెలంగాణ ట్రైన్ ప్రయాణికులకు గుడ్న్యూస్. రాష్ట్రంలో మరో ట్రైన్ లైన్ అందుబాటులోకి రానుంది. రాజధాని హైదరాబాద్కు ట్రైన్ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ శివారు పటాన్చెరు-ఆర్మూర్-ఆదిలాబాద్ నూతన రైల్వే లైన్ పనుల ప్రారంభానికి కేంద్ర రైల్వే శాఖ రెడీ అయింది. ఈ కొత్త లైన్ మంజూరైందని, దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తుది దశకు చేరుకుందని తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు లేఖ ద్వారా తెలియజేశారు. త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు
ప్రస్తుతం నిజామాబాద్ వాసులు హైదరాబాద్ నగరానికి చేరుకోవడానికి డిచ్పల్లి, కామారెడ్డి, అక్కన్నపేట, మీర్జాపెల్లి, బొల్లారం, సికింద్రాబాద్ మీదుగా సుదీర్ఘంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని కిన్వట్, సహస్రకుండ్, హిమాయత్నగర్, ముద్కేడ్, ఉమ్రి మీదుగా తిరిగి నిజామాబాద్ చేరుకోవడానికి 231 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఆదిలాబాద్-ఆర్మూర్ మీదుగా కొత్త మార్గం నిర్మిస్తే సుమారు 72 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం, ఖర్చు గణనీయంగా ఆదా అవుతుంది. ఈ నూతన ప్రాజెక్టు గత రెండు, మూడేళ్లుగా చర్చలో ఉన్నా, తాజాగా రైల్వే శాఖ మంత్రి లేఖతో ఆశలు మళ్లీ చిగురించాయి.