జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రభుత్వాలకు పతనం తప్పదు..
- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య హెచ్చరిక.
- సూర్యాపేటలో ఘనంగా జిల్లా నాలుగో మహాసభ
- జిల్లా అధ్యక్షుడిగా పాల్వాయి జానయ్య ఎన్నిక
సూర్యాపేట:
సమాజ హితం కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల సమస్యలను నిర్లక్ష్యం చేసే ఏ ప్రభుత్వానికైనా పతన కాలం సమీపించినట్లేనని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య హెచ్చరించారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని భాస్కర్ ఇన్ ప్యాలెస్లో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాలుగవ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ వ్యవస్థలను మేల్కొలిపే జర్నలిస్టుల జీవితాలు ప్రస్తుతం అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వృత్తి భద్రత కల్పించాలి
జర్నలిస్టుల వృత్తి అత్యంత క్లిష్టంగా మారిందని, వారి సంక్షేమం మరియు భద్రత చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని సోమయ్య స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పోరాడుతుందన్నారు. అనంతరం ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర కో-కన్వీనర్ బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిజం గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
నూతన కార్యవర్గ ఎన్నిక
ఈ మహాసభలో సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షుడు: పాల్వాయి జానయ్య
జిల్లా కార్యదర్శి: ముశం హరిప్రసాద్
కోశాధికారి: తాందారపల్లి శ్రీనివాస్
ఎలక్ట్రానిక్ మీడియా విభాగం: లింగాల సాయి గౌడ్ (అధ్యక్షుడు), నందిపాటి సైదులు (కార్యదర్శి).
నాయకత్వ బాధ్యతలు చేపట్టిన పాల్వాయి జానయ్య మాట్లాడుతూ.. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని కోరారు. అనంతరం సభ్యులకు ఇన్సూరెన్స్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తన్నీరు శ్రీనివాస్, కుడితాడి బాపురావు, జి. వెంకటేశ్వర్లు, టి. సంతోష్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
