పీసీసీ చీఫ్ మాటలు ‘ఉల్టా పుల్టా’.. పాండురంగారెడ్డి ఫైర్!

పీసీసీ చీఫ్ మాటలు ‘ఉల్టా పుల్టా’.. పాండురంగారెడ్డి ఫైర్!

హైదరాబాద్:

 "చెప్పేటోనికి వినేటోడు లోకువైనట్టుంది మహేష్ కుమార్ గౌడ్ తీరు" అంటూ తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌లోకి వస్తానంటే తానే వద్దన్నానంటూ పీసీసీ ప్రెసిడెంట్ చేసిన కామెంట్లను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదివారం ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన ఆయన.. కాంగ్రెస్ సర్కార్ తీరుపై, మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు.

​గ్యారెంటీలు గాలికి.. గప్పాలకే ప్రాధాన్యం!

​రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదవుతున్నా, ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని పాండురంగారెడ్డి ఎద్దేవా చేశారు. "పైసల్లేక ఖజానా ఖాళీ అయింది.. జనాల నుంచి తిరుగుబాటు మొదలైంది. ఈ తిప్పల నుంచి తప్పించుకోవడానికే కొత్త డ్రామాలకు తెరలేపారు" అని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇట్లాంటి పల్టీ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

​‘జాగృతి’ని చూస్తే వణుకు పుడుతోందా?

​తెలంగాణ జాగృతి త్వరలోనే రాజకీయ పార్టీగా రాబోతుండటంతో కాంగ్రెస్ నాయకులకు నిద్ర పట్టడం లేదని ఆయన అన్నారు. "జాగృతికి వస్తున్న జనం, ఆదరణ చూసి మహేష్ కుమార్ గౌడ్‌కు భయం పట్టుకుంది. అందుకే ఇట్లాంటి సత్యదూరమైన మాటలు మాట్లాడుతుండు. సొంత పార్టీల ఉన్న లొల్లిని సెట్ చేసుకోలేక, నాయకులను కలుపుకోలేక సతమతమవుతున్న పీసీసీ చీఫ్.. ఇంకొకరి గురించి మాట్లాడటం హాస్యాస్పదం" అని చురకలంటించారు.

​బురద రాజకీయాలు బంద్ చెయ్యి..

​తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ప్రత్యర్థులపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోవడానికి పడుతున్న ఆరాటం తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. "ఇకనైనా ఇట్లాంటి చౌకబారు మాటలు మానుకోకపోతే జనం బుద్ధి చెప్తారు. జాగృతి నైతిక బలాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు" అని పాండురంగారెడ్డి గట్టిగా హెచ్చరించారు.

About The Author