అక్రెడిటేషన్ జీవోను సవరించాల్సిందే.!

  • ​‘ప్రెస్’ స్టిక్కర్ నిబంధనను వెంటనే తొలగించండి.
  • ​మంత్రి పొంగులేటి, స్పెషల్ కమిషనర్ ప్రియాంకకు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి..
  • ​కేబుల్ ఛానళ్లు, నియోజకవర్గ రిపోర్టర్లకు అన్యాయం జరుగుతోంది..
  • ​అక్రెడిటేషన్ లేని వారు జర్నలిస్టులు కాదా?: మామిడి సోమయ్య..

అక్రెడిటేషన్ జీవోను సవరించాల్సిందే.!

హైదరాబాద్,:

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సవరించిన మీడియా అక్రెడిటేషన్ జీవో 252లో ఇంకా లోపాలున్నాయని, దాన్ని సమూలంగా మార్చాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. మంగళవారం సచివాలయంలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, సమాచార భవన్‌లో స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంకను ఫెడరేషన్ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. జీవో సవరణపై హర్షం వ్యక్తం చేస్తూనే, క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.

​కేబుల్ ఛానళ్లకు మొండిచేయి!

​సవరించిన జీవోలో కేబుల్ ఛానళ్లు, నియోజకవర్గ స్థాయి రిపోర్టర్ల ప్రస్తావనే లేకపోవడంపై నేతలు అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కేబుల్ ఛానళ్లకు 12 రాష్ట్ర స్థాయి, 4 జిల్లా స్థాయి కార్డులు ఉండేవని, ఇప్పుడు ఆ ఊసే లేదని వాపోయారు. అలాగే ఎంపానల్‌మెంట్ లేని చిన్న, మధ్యతరహా పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు కూడా కార్డులు మంజూరు చేయాలని కోరారు. క్రమం తప్పకుండా వస్తున్న పత్రికలను తక్షణమే ఎంపానల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

​ఆ సర్క్యులర్ అవమానకరం..
​అక్రెడిటేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్ వాడాలన్న నిబంధనను టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య తీవ్రంగా తప్పుబట్టారు.
​"రాష్ట్రంలో 50 వేల మంది జర్నలిస్టులు ఉంటే, ప్రభుత్వం కేవలం సగం మందికే అక్రెడిటేషన్లు ఇస్తోంది. కార్డు లేనంత మాత్రాన వారు జర్నలిస్టులు కాకుండా పోతారా? కేవలం సంక్షేమ పథకాల కోసం ఇచ్చే కార్డును జర్నలిస్టు గుర్తింపునకు ప్రామాణికంగా మార్చడం వృత్తి స్వేచ్ఛను హరించడమే."
- మామిడి సోమయ్య, టీడబ్ల్యూజేఎఫ్ కన్వీనర్

​నకిలీ జర్నలిస్టులను ఏరివేయడానికి ప్రత్యేక నిబంధనలు తేవాలే తప్ప, దాని పేరుతో అసలైన జర్నలిస్టులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. అక్రెడిటేషన్ లేని రిపోర్టర్ల పరిస్థితి 'మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు' తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ ప్రియాంక.. రవాణా శాఖ అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు తన్నీరు శ్రీనివాస్, కుడుతాడు బాపురావు, రవి కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author