రసాయన శాస్త్రంలో కేత స్వరూపకు పీహెచ్.డీ.
పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని కేత స్వరూప డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘చాల్కోన్ కలిపిన పిరిడిన్-పిరిమిడిన్, 1,2,4-ఆక్సాడయాజోల్ కలిపిన ఇండోలిజైన్-థయాడయాజోల్ ఉత్పన్నాల రూపకల్పన, సంశ్లేషణ, జీవ మూల్యాంకనం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.
ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిత్తలూరి సుధాకర్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ పరిశోధనలో భాగంగా, డాక్టర్ స్వరూప ఔషధపరంగా ముఖ్యమైన రసాయన నిర్మాణాలను ఏకీకృతం చేయడం ద్వారా జీవశాస్త్రపరంగా ప్రాముఖ్యత కలిగిన రెండు శ్రేణుల సమ్మేళనాలను రూపొందించి, సంశ్లేషించినట్టు తెలిపారు. సంశ్లేషించిన ఈ సమ్మేళనాలను ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీతో సహా ప్రామాణిక విశ్లేషణాత్మక పద్ధతులను ఉపయోగించి నిర్మాణాత్మకంగా వర్గీకరించి, తదనంతరం వాటి జీవ క్రియాశీలతను మూల్యాంకనం చేశారన్నారు. అనేక సమ్మేళనాలు ప్రోత్సాహకరమైన ఫలితాలను కనబరిచాయని, భవిష్యత్తు ఔషధ అభివృద్ధికి వాటి సామర్థ్యాన్ని సూచిస్తున్నాయని వివరించారు.
డాక్టర్ స్వరూప సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
