మున్సిపల్ పోరు ముగిసె.. ‘హస్తం’ జోరు పెరిగె..?

  • ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్.. 13న ఫలితాలు
  • ​70 శాతం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయకేతనం..?
  • ​నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ ఆధిక్యం.. బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ..!
  • ​పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఆసక్తికర అంశాలు

మున్సిపల్ పోరు ముగిసె.. ‘హస్తం’ జోరు పెరిగె..?

హైదరాబాద్: 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం బుధవారంతో ముగిసింది. స్వల్ప సంఘటనలు మినహా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 5 గంటల సమయానికే పోలింగ్ ముగిసినప్పటికీ, అప్పటికే క్యూ లైన్లలో ఉన్న వారికి అధికారులు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. గడప గడపకూ ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీల అదృష్టం ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అదే రోజు పట్టణ పీఠాలు ఎవరివనేది తేలిపోనుంది.

​కాంగ్రెస్ హవా.. విపక్షాలకు దెబ్బేనా?

​పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకోనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. దాదాపు 70 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను హస్తం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా రామగుండం, మంచిర్యాల, నల్లగొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం కార్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోందని విశ్లేషించింది.

బీజేపీ దూకుడు.. బీఆర్ఎస్ కు నిరాశే!

​ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ జెండా ఎగురవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు చోట్లా కమలం పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని సర్వే పేర్కొంది. కాగా, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు కోలుకోలేని దెబ్బ తీయనున్నట్లు తెలుస్తోంది. ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‌ను కూడా సొంతంగా గెలుచుకునే పరిస్థితి లేదని పీపుల్స్ పల్స్ తేల్చిచెప్పడం గమనార్హం.

​కింగ్ మేకర్ గా ఎంఐఎం..

​నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ వంటి కీలక కార్పొరేషన్లలో ఎంఐఎం నిర్ణయాత్మక శక్తిగా మారనుంది. మేయర్ పీఠాలను కైవసం చేసుకునే క్రమంలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోయినా, ఎంఐఎం మద్దతు కీలకం కానుంది.

​గెలుపు గుర్రాలు ఎవరంటే?

​రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలలో:
​కాంగ్రెస్: 68-76 స్థానాల్లో గెలుపు ఖాయమని అంచనా.?

​బీఆర్ఎస్: 29-36 స్థానాలకు పరిమితం కానుంది.

​బీజేపీ: 3-5 చోట్ల మాత్రమే సత్తా చాటనుంది.

​దాదాపు 8-14 మున్సిపాలిటీల్లో మాత్రం ప్రధాన పార్టీల మధ్య 'నువ్వా-నేనా' అన్నట్లుగా హోరాహోరీ పోటీ నెలకొంది.

​ఓట్ల శాతం పరంగా చూస్తే కాంగ్రెస్‌కు 36 శాతం, బీఆర్ఎస్‌కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం వచ్చే అవకాశాలున్నాయి. 

కౌంటింగ్ కోసం అధికారులు ఇప్పటికే 136 కేంద్రాలను సిద్ధం చేశారు. 13న ఫలితాలు వెలువడగా, 16వ తేదీన మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ జరగనుంది.

About The Author