నగరంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కమిషనర్ ఆర్.వి. కర్ణన్..
హైదరాబాద్:
భాగ్యనగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు అదనపు, జోనల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన 'వెబ్ ఎక్స్' దృశ్య మాధ్యమ సమీక్షలో ఆయన అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ మరియు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో నగరంలో సాగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ పురోగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. గత నెల 29న ప్రారంభమైన ప్రత్యేక డ్రైవ్ ఈ నెల 31న ముగియనుందని, రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించాలని సూచించారు. అధికారులు కేవలం పర్యవేక్షణకే పరిమితం కాకుండా, స్వయంగా క్షేత్ర తనిఖీలు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంతో పాటు పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించి, వారి భాగస్వామ్యంతో హైదరాబాద్ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ముమ్మరంగా మెగా సానిటేషన్ డ్రైవ్:
నిర్వహించిన ప్రాంతాలు: 300 వార్డుల్లోని 3,613 ఏరియాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు, పార్కులు మరియు గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు.
వ్యర్థాల తరలింపు: ఇప్పటివరకు మొత్తం 5,641 మెట్రిక్ టన్నుల అదనపు వ్యర్థాలను తొలగించారు.
జోనల్ మరియు డిప్యూటీ కమిషనర్లు ఈ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని కమిషనర్ వెల్లడించారు.
