హెడ్లైట్ల నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా!
- *మల్కాజిగిరి పరిధిలో ప్రత్యేక డ్రైవ్
- *ఒక్క రోజే 1,531 కేసులు.. రూ. 2.67 లక్షల ఫైన్
*మల్కాజిగిరి:
రాత్రి వేళల్లో వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా హైబీమ్ లైట్లు, కళ్లు మిరుమిట్లు గొలిపే హై-ఇంటెన్సిటీ లైట్లు వాడటం, అసలు హెడ్లైట్లు లేకుండానే డ్రైవింగ్ చేయడంపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. రోడ్డు భద్రత, రాత్రి సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ట్రాఫిక్ జోన్-1, జోన్-2 పరిధిలో మంగళవారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. డిసిపి ట్రాఫిక్-II పర్యవేక్షణలో అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఈ డ్రైవ్లో చురుగ్గా పాల్గొన్నారు.
*భారీగా కేసులు.. జరిమానాలు
ఈ ప్రత్యేక డ్రైవ్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. అనధికారిక లైట్లు, హైబీమ్ వినియోగం, హెడ్లైట్లు లేని వాహనాలపై ఒకే రోజు రికార్డు స్థాయిలో 1,531 కేసులు నమోదు చేశారు. ఉల్లంఘనదారులకు రూ. 2,67,000/- జరిమానా విధించారు. ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, వాణిజ్య సముదాయాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లు, విద్యా సంస్థల పరిసరాల్లో ప్రత్యేక బృందాలను మోహరించి ఈ తనిఖీలు నిర్వహించారు.
వాహనాల్లో లైటింగ్ వ్యవస్థను సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నిరంతరం హైబీమ్, మిరుమిట్లు గొలిపే లైట్లను వాడటం వల్ల ఎదురుగా వచ్చే డ్రైవర్ల కళ్లు బైర్లు కమ్మి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా నడపడం వల్ల కాలినడకన వెళ్లే పాదచారులకు, ఇతర వాహనదారులకు ముప్పు పొంచి ఉంటోందని హెచ్చరించారు.
"వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, వాహన లైట్లను నిబంధనల ప్రకారమే ఉపయోగించాలి. సురక్షిత ప్రయాణం, క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ను పెంపొందించేందుకు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి ప్రత్యేక తనిఖీలను నిరంతరం కొనసాగిస్తారు."
*ట్రాఫిక్ విభాగం, మల్కాజిగిరి
