విద్యార్థులను బలిపశువులను చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం..
- ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థలో లోపం ఎక్కడుంది?
- ప్రభుత్వం ఆలస్యం చేస్తుందా? లేక యాజమాన్యాలు ఒత్తిడి పెడుతున్నాయా?
- విద్యార్థుల భవిష్యత్తు కాపాడటానికి ఎవరు ముందుకు రావాలి?
- రీయింబర్స్మెంట్ విధానాన్ని పూర్తిగా డిజిటల్ చేయడం పరిష్కారమా?
- కోర్టు మెట్లెక్కిన కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యం..
- ఆ కాలేజీ యాజమాన్యాలకు అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు..
- ఇక అదే దారిలో నడువనున్న మిగతా ఇంజినీరింగ్ కాలేజీలు..
- కాలేజీ ఉద్యోగస్తులకు ఎన్నో నెలలుగా జీతాలు చెల్లించని వైనం..
- వందలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్స్ ఇంకా కాలేజీలలోనే..
- పై చదువులకు వెళ్లలేక, వచ్చిన ప్రైవేట్ ఉద్యోగాలకూ వెళ్లలేక..
- అప్పులు చేసి ఫీజులు కట్టలేక ఉసూరుమంటున్న తల్లిదండ్రులు..
- అటు కళాశాలల యాజమాన్యం, ఇటు ప్రభుత్వం రెండిటి మధ్యా నలుగుతున్న విద్యార్థులు..
- తక్షణమే పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అంశం మళ్లీ తీవ్రమైన చర్చనీయాంశంగా మారిపోయింది.. ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ నిధులు ఆలస్యంగా విడుదలవుతుండటంతో, అనేక ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. దీని ప్రభావం నేరుగా లెక్చరర్లపై, విద్యార్థులపై పడుతోందన్నది నిర్విదాంశం..
కాలేజీల ఆర్థిక ఇబ్బందులు :
ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పలు కాలేజీలు లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు ఆందోళనలకు దిగారు. మరోవైపు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కొన్ని కాలేజీలు నిరోధించాయి.
కోర్టు మెట్లెక్కిన కొన్ని యాజమాన్యాలు :
అనేక ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వంపై కోర్టులో కేసులు వేశాయి. “మాకు రావలసిన రీయింబర్స్మెంట్ మొత్తాన్ని నెలల తరబడి నిలిపివేయడం వల్ల నష్టపోతున్నాం” అని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఒకటి రెండు కాలేజీలకు కోర్టు అనుకూలంగా తీర్పుకూడా ఇచ్చింది..
విద్యార్థులే బలిపశువులు :
అటు ప్రభుత్వం, ఇటు కాలేజీల యాజమాన్యాల నడుమ విద్యార్థులు బలిపశువులు అవుతున్నారు.. ప్రభుత్వం నుంచి బకాయిలు రాక, స్వయంగా ఫీజు చెల్లించే వెసులుబాటు లేక, సర్టిఫికేట్లు అందక సతమతమైపోతున్నారు.. ఇది వాంఛనీయం కాదంటున్నారు విశ్లేషకులు.. విద్యార్థుల ఇబ్బందులను తక్షణమే తొలగించాలని సూచిస్తున్నారు.. రీయింబర్స్మెంట్ సమస్యలతో సర్టిఫికెట్లు దొరకకపోవడమే కాకుండా.. ఉద్యోగాలు లేదా ఉన్నత చదువులు కోల్పోతున్న విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. “మేమేం తప్పు చేశాం..? మా భవిష్యత్తు ఎందుకు బలి కావాలి..?” అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం సమాధానం చెప్పగలదా..?
తక్షణమే ప్రభుత్వం చేయాల్సినవి :
రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో పారదర్శకత, వేగం కల్పించాలి. లెక్చరర్ల జీతాలు ఆలస్యం కాకుండా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల సర్టిఫికెట్లను నిరోధించే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం, కాలేజీలు, విద్యార్థి సంఘాలు కలిసి ఒక సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది..
కానీ ఈ వ్యవహారం వెనుక ఎదో కుట్రకోణం దాగుందని పలువురు విశ్లేషకులు వాదిస్తున్నారు.. ఫీజ్ రీ యంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, సరిపడా నిధులు ఉన్నాయని చెబుతున్నారు.. కేవలం మధ్య, సామాన్య, నిరుపేద విద్యార్థులను ఎదగనీయకుండా.. ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కలిసి ఈ వ్యవహారం నడిపిస్తున్నారని వారు వాదిస్తున్నారు.. ఇందులో నిజానిజాలు ఏమిటో నిగ్గు తేల్చాలని " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " డిమాండ్ చేస్తోంది..
