
సంగారెడ్డి :
జిల్లాలో ఆరోగ్య సదుపాయాల నాణ్యత పెంపునకు అధికారులు, వైద్య సిబ్బంది మరింత శ్రద్ధ తీసుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 17వ కామన్ రివ్యూ మిషన్ బృందం డీ-బ్రీఫింగ్ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. సమీక్షలో జిల్లాలోని ప్రాంతీయ ఆస్పత్రి, మాతా, శిశు సంరక్షణ కేంద్రాలను సందర్శించి మానవ వనరులు, ల్యాబ్ సదుపాయాలు, ఫార్మసీ, డైట్, ఆసుపత్రిలో వస్తున్న ఇన్, అవుట్ పేషంట్ల పరిమాణం, పారిశుద్ధ్యం,సేవలపై సమగ్ర సమీక్ష జరిపింది. భారత ప్రభుత్వ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 3 నుండి 5 వరకు ఈ సంగారెడ్డి జిల్లాలో బృందం పర్యటించింది. పర్యటనలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు ఆరోగ్య సంస్థల్లో అందిస్తున్న సేవలు, మానవ వనరులు, ఔషధాల లభ్యత, మాతృ - శిశు ఆరోగ్య సేవల అమలు, ఆయుష్మాన్ భారత్ వెల్నెస్ సెంటర్ల ప్రగతి తదితర అంశాలను పరిశీలించారు.
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రి, పటాన్చెరు ఏరియా హాస్పిటల్, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్,సదాశివ్ పేట సిహెచ్సి, ఆత్మకూరు, కంగ్టి, ఆర్సీ పురం ప్రాథమిక కేంద్రాలు, మార్క్స్ నగర్ U-PHC, ఇందిరానగర్ బస్తీ దవాఖాన, ఆయుష్ డిస్పెన్సరీలను సందర్శించి వివరాలు సేకరించారు.
బృందానికి టీమ్ లీడర్గా ప్రాంతీయ డైరెక్టర్, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ,( తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ) డాక్టర్ అనురాధ మేడోజు వ్యవహరించారు. సభ్యులుగా డాక్టర్ సంతోష్ నాయక్ – కన్సల్టెంట్, డాక్టర్ రంజన్ దాస్ – ప్రతినిధి, హైదరాబాద్ డాక్టర్ కవిత చౌదరి – సీనియర్ కన్సల్టెంట్, అరుణ్ శర్మ – ఫైనాన్స్ కన్సల్టెంట్, ఆర్టి నరేడా – కన్సల్టెంట్, డాక్టర్ పర్వీన్ సుల్తానా – సీనియర్ మెడికల్ ఆఫీసర్ హైదరాబాద్ లు వ్యవహరించారు. ఈ సందర్భంగా కామన్ రివ్యూ మిషన్ బృందం సమర్పించిన సూచనలను జిల్లాలో అమలుపచ్చి వైద్య ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు కృషి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు . ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి నాగ నిర్మల , జి జి హెచ్ సూపరెంటెండెంట్ మురళీకృష్ణ , డిసిహెచ్ఓ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.