వెంటనే వరి కొనుగోలు చేయాలి.. రైతులకు నష్టం కలిగించొద్దు : బీఆర్ఎస్ నేతలు
- ఫోటోలకు మాత్రమే కొనుగోలు కేంద్రాల ప్రారంభమా..? కాంగ్రెస్పై విమర్శలు
- వర్షాలు వస్తే రైతుల వరి పూర్తిగా నష్టపోతుంది : రైతు దీక్షలో ఆవేదన
- 24 గంటల్లో వరి కొనుగోలు చేయాలి
- లేకపోతే తాండూర్ ను దిగ్బంద్ధం చేస్తాం
- లక్ష్మినారాయణపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ రైతు దీక్ష
వికారాబాద్:
యాలాల మండలం లక్ష్మినారాయణపూర్ చౌరస్తాలో నిర్వహించిన రైతు దీక్షలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన వరిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వరి పెద్ద ఎత్తున నిల్వ ఉండిపోయిందని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కేవలం ఫోటోలకు ఫోజులు ఇస్తూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని, తరువాత వాటిని పట్టించుకోకపోవడం విచారకరమని విమర్శించారు. కొద్ది రోజుల్లో తొలికాలం వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో వర్షాలు కురిస్తే రైతులు పండించిన వరి మొత్తం తడిసి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించకుండా వెంటనే వరి కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు బీఆర్ఎస్ నాయకులు బెన్నూర్ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. అక్కడ నిల్వ ఉన్న వరి పరిస్థితిని పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ రైతు దీక్షలో యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, తాండూర్ బిఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి, రాజు పటేల్, యాలాల మాజీ వైస్ ఎంపీపీ అనంతయ్య ముదిరాజ్, యాలాల సహకార సంఘం వైస్ చైర్మన్ వడ్డె రాములు, మాజీ సర్పంచులు శివకుమార్, పటేల్ రెడ్డి, రవి గౌడ్, బసిరెడ్డి, బిచ్చయ్య, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, శరణు, కొప్పుల యాదప్ప, లాలు ముదిరాజ్, శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, అభిమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
