జలమండలి ఎండి అశోక్ రెడ్డితో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భేటీ

జలమండలి ఎండి అశోక్ రెడ్డితో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భేటీ

ఎల్బీనగర్:

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శుక్రవారం జలమండలి & సీవరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రజా సమస్యలపై చర్చించారు.ఈ సందర్భంగా చంపాపేట్ డివిజన్ (కర్మన్‌ఘాట్) పరిధిలోని క్రాంతినగర్ కాలనీలో బోర్‌వెల్ విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణ చేయాలని కోరారు. కాలనీలో సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరిలో అధిక సంఖ్యలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలే ఉన్నాయని తెలిపారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న కారణంగా ప్రజలు బోర్‌వెల్‌లపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు.గతంలో బోర్‌వెల్‌కు సంబంధించిన విద్యుత్ బిల్లులను జీహెచ్ఎంసీ చెల్లించగా, అనంతరం జలమండలి వారు తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం రూ.6,38,641/- బకాయిని కాలనీవాసులే చెల్లించాలని విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని బోర్‌వెల్ విద్యుత్ కనెక్షన్‌ను తక్షణమే పునరుద్ధరించి బకాయి బిల్లులను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం వచ్చే బిల్లులను అసోసియేషన్ వారే కట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.అదే విధంగా బి.యన్.రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ పరిసరాల్లో ట్రంక్ లైన్ పనుల అంశాన్ని కూడా ఎం.డి. దృష్టికి తీసుకెళ్లారు. సాగర్ కాంప్లెక్స్ నుంచి వచ్చే డ్రైనేజీ నీరు సరైన అవుట్‌లెట్ లేక గుర్రంగూడ ఫారెస్ట్ హరిహారపురం కాలనీలోకి చేరుతూ ఫారెస్ట్ ప్రాంతంలోని రెండు చెరువులు మురికికూపాలుగా మారిపోయాయని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా నూతన ట్రంక్ లైన్ మంజూరు చేయాలని కోరారు.అలాగే ప్రస్తుతం సరూర్‌నగర్ చెరువు పరిధిలో 2.5 ఎంఎల్డి సామర్థ్యం మాత్రమే ఉన్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని దానిని 9 లేదా 10 ఎంఎల్డి వరకు పెంచాలని సుధీర్ రెడ్డి గారు కోరారు. దీనివల్ల చెరువులో కలుషిత నీరు తగ్గడంతో పాటు దుర్వాసన సమస్య తగ్గి, నీటి నాణ్యత మెరుగుపడి పరిసర కాలనీల ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.అలాగే నియోజకవర్గంలోని డ్రైనేజీ సమస్యలు కూడా పరిష్కారం చేయాలనీ కోరారు. శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు.అనంతరం ఎండి అశోక్ రెడ్డి మాట్లాడుతూ, తప్పకుండా సుధీర్ రెడ్డి చెప్పిన అంశాలను పరిగణనలో తీసుకొని సంబంధించిన అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కటికరెడ్డి అరవింద రెడ్డి,గండికోట శ్రీనాథ్ పలువురు కాలనీవాసులు ఆనంద్,దివాకర్, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.

About The Author