సిటీలో ‘జనగణన’ షురూ.. నేటి నుంచే ఇంటింటికీ ఎన్యుమరేటర్లు!
- గ్రేటర్ వ్యాప్తంగా మొదలైన గృహ గణన ప్రక్రియ
- సెన్సస్ 2027 కోసం 25 వేల మంది సిబ్బంది రంగంలోకి
- ప్రజలు సహకరించాలంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్
హైదరాబాద్:
సిటీలో సెన్సస్ (జనగణన) సందడి మొదలైంది. 2027లో జరగబోయే మహా జనాభా గణనలో భాగంగా.. తొలి దశ ‘గృహ గణన’ (House Listing) పనులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాల్లో ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. వచ్చే నెల (జూన్ 9) వరకు ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించనున్నారు.
పక్కా ప్లాన్తో సర్కార్..
గణన కోసం సర్కార్ పక్కా ఏర్పాట్లు చేసింది. గ్రేటర్ వ్యాప్తంగా *19,868 బ్లాకులను* గుర్తించి, వాటిని డిజిటల్ మ్యాపింగ్ చేసింది.
భారీగా సిబ్బంది: మొత్తం 21,773 మంది ఎన్యుమరేటర్లు, 3,402 మంది సూపర్వైజర్లకు ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు.
ఈసారి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకునే ఛాన్స్ ఇవ్వగా.. సుమారు 1.27 లక్షల ఫ్యామిలీలు సొంతంగా డీటెయిల్స్ అప్లోడ్ చేశాయి.
డిజిటల్ సెన్సస్: పాత పద్ధతిలో కాకుండా ‘హెచ్.ఎల్.ఓ’ అనే మొబైల్ యాప్ ద్వారా అప్పటికప్పుడే డేటాను ఎన్యుమరేటర్లు ఆన్లైన్ చేస్తున్నారు.
1. *నెంబర్లు వేస్తారు:* ప్రతి ఇంటికి వెళ్లి భవనాన్ని తనిఖీ చేసి, దాని మెయిన్ డోర్ దగ్గర చాక్ పీస్ లేదా పెయింట్తో సెన్సస్ నంబర్ వేస్తారు.
2. వసతుల ఆరా: ఇల్లు పక్కాదా? కచ్చాదా? ఇంట్లో ఎన్ని గదులున్నాయి? తాగునీరు, కరెంట్, టాయిలెట్ వంటి వసతులు ఎలా ఉన్నాయి? అనే వివరాలు అడిగి తెలుసుకుంటారు.
3. జియో ట్యాగింగ్: కేటాయించిన బ్లాక్ మ్యాప్ ప్రకారం ప్రతి ఇంటిని జియో ట్యాగ్ చేస్తారు. దీనివల్ల ఏ ఒక్క ఇల్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు.
గణన షెడ్యూల్ ఇలా..
గృహ గణన (మొదటి దశ): 2026 మే 11 నుంచి జూన్ 9 వరకు.
జనాభా గణన (రెండో దశ): 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు.
రివిజనల్ రౌండ్:* 2027 మార్చి 1 నుంచి 5 వరకు.
వివరాలు కరెక్ట్ గా చెప్పండి: కమిషనర్ కర్ణన్
నగర భవిష్యత్తు కోసం ప్రభుత్వం రూపొందించే పథకాలకు ఈ డేటానే కీలకమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. "సిటీ డెవలప్మెంట్ కావాలన్నా, ప్రజా సేవలు మెరుగుపడాలన్నా కచ్చితమైన లెక్కలు ఉండాలి. అందుకే ఎన్యుమరేటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించి కచ్చితమైన వివరాలు చెప్పాలి" అని ఆయన కోరారు.
