ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణకు రైతు కమిటీలు
చైర్మన్, వైస్ చైర్మన్ తో సహా పది మందితో కమిటిలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట :
ఎత్తిపోతల నిర్మాణాలలో విధిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు.నాణ్యతా ప్రమాణాల అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.నాణ్యతా లోపించిందని తెలిస్తే ఉపేక్షించేది లేదని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.రైతాంగాం కళ్ళలో వెలుగులు నింపడంతో పాటు హుజుర్నగర్,కోదాడ నియోజకవర్గలను సస్యశ్యామలం చేయడానికే ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదలు పెట్టమన్నారు.అటువంటి నిర్మాణంలో నాణ్యత లోపించిందని తేలితే సహించేది లేదని ఆయన అధికారులకు,ఏజెన్సీ లకు అల్టిమేటం జారీ చేశారు. హుజుర్నగర్,కోదాడ నియోజకవర్గాలలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలపై మంగళవారం రోజున డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎత్తిపోతల పథకాల నిర్మాణాల నిమిత్తం ప్రభుత్వం భూసేకరణ నిర్వహించి రైతులకు నగదు చెల్లింపులు జరిపిన భూములను సత్వరమే అధికారులు స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. పంటకు పంటకు మధ్యలో ఉండే సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.ఎత్తిపోతల పథకాల నిర్మాణాల పై ఆయకట్టు రైతాంగం పెంచుకున్న ఆశలు అమలులోకి రావాలి అంటే నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడమే నని ఆయన పేర్కొన్నారు..
