రంజాన్ వేళ నగరం తళతళలాడాలి: జీహెచ్ఎంసీ కమిషనర్
చార్మినార్ జోన్లో పారిశుద్ధ్య పనుల క్షేత్రస్థాయి తనిఖీ
హైదరాబాద్ :
రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా, ప్రభావవంతంగా జరిగేలా చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను జోనల్, డిప్యూటీ కమిషనర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం ఆయన అదనపు కమిషనర్ (సానిటేషన్) రవికిరణ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డితో కలిసి చార్మినార్ జోన్ పరిధిలోని మక్కా మసీదు, మదీనా, చార్మినార్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.
ప్రత్యేక నిఘా: రంజాన్ సందర్భంగా జనసంచారం విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున, ప్రధాన రహదారులు, కూడళ్లు, ప్రార్థనా స్థలాల వద్ద ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలి.
రియల్ టైమ్ మానిటరింగ్: పారిశుద్ధ్య పనుల్లో నాణ్యతను పెంచేందుకు రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలి.
మార్కెట్లలో క్లీనింగ్: వాణిజ్య, మార్కెట్ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోకుండా రాత్రిపూట కూడా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలి.
డ్రైనేజీల నిర్వహణ: డ్రైన్లు పొంగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
సహకరించండి:
నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు పౌరులు, వ్యాపారులు పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో చార్మినార్ డిప్యూటీ కమిషనర్ సరితతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
