సమిష్టి కృషితోనే నగర ప్రగతి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

స్టాండింగ్ కమిటీ ఆమోదించిన పనులన్నీ పూర్తి చేస్తాం: కమిషనర్ ఆర్.వి.కర్ణన్.

సమిష్టి కృషితోనే నగర ప్రగతి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్:

నగర ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం మరియు సమిష్టి కృషితోనే గడిచిన ఐదేళ్లలో గ్రేటర్ హైదరాబాద్‌లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయగలిగామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె అధ్యక్షతన తుది స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీహెచ్‌ఎంసీకి మేయర్‌గా సేవలు అందించడం తనకు దక్కిన గౌరవమని, తన పదవీకాలంలో కమిషనర్, అధికారులు అందించిన సహకారం మరువలేనిదని భావోద్వేగంగా వెల్లడించారు.

​సమస్యల పరిష్కారమే లక్ష్యం:

​జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ.. క్లిష్ట సమయాల్లోనూ ప్రజాప్రతినిధుల సహకారంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించామన్నారు. వార్డుల పునర్వ్యవస్థీకరణపై ప్రత్యేక సెషన్ నిర్వహించి సభ్యుల అభ్యంతరాలను స్వీకరించామని, కార్పొరేటర్లు లేవనెత్తిన ప్రజా సమస్యలను గరిష్ఠంగా పరిష్కరించామని తెలిపారు. స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందిన ప్రతి అభివృద్ధి పనినీ క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

​స్టడీ టూర్ నివేదిక సమర్పణ:

​ఇటీవల మేయర్ నేతృత్వంలోని కార్పొరేటర్ల బృందం అహ్మదాబాద్, రాజ్‌కోట్ నగరాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ గమనించిన ఉత్తమ పురపాలక విధానాలు, మౌలిక వసతుల కల్పనపై రూపొందించిన సమగ్ర నివేదికను సమావేశం అనంతరం మేయర్, కమిషనర్‌కు అందజేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఈ విధానాలను అధ్యయనం చేసి అమలు చేయాలని సూచించారు.

​వీడ్కోలు సత్కారాలు..

​మేయర్ పదవీకాలం రేపటితో (మంగళవారంతో) ముగియనున్న నేపథ్యంలో, కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తన ఛాంబర్‌లో మేయర్‌ను శాలువాతో సత్కరించి, మెమెంటోను బహుకరించారు. అదేవిధంగా, స్టాండింగ్ కమిటీ సభ్యులు మేయర్, కమిషనర్‌లను ప్రత్యేకంగా ప్రశంసించారు. తమ వార్డుల్లోని సమస్యలను ఓపికగా విని పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వారిని సన్మానించారు. అనంతరం అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు.

About The Author