పంచుకుంటే పెరిగేది ఆనందం
- ఈ హిందువులకి నోముల పిచ్చి ఏమిటండి?
- ఈ కాలంలో కూడానా..! ఈ పేరంటాలు, పట్టు చీరలు, వాయినాల హడావిడి వేలం వెర్రి..!
- ఇదంతా వృధా కాలయాపన, డబ్బు ఖర్చు తప్ప వీటితో ఒరిగేదేమీ ఉండదు.
- ఆధ్యాత్మికత ఎక్కడుంది? హేతుబద్ధత ఎక్కడుంది?
- అని కొందరు మేధావులు ఈసడించుకుంటూ చేసే విమర్శలకు ఈ వ్యాసం చక్కని సమాధానం.
.jpg)
ఈ ప్రపంచంలో నిరంతరం ఏవేవో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. మార్పు అనేది ప్రకృతి సహజం. నిన్నటిలా నేడు ఉండదు. నేటిలా రేపు ఉంటుందని ఊహించలేం! అయినప్పటికీ ఇన్ని వేల సంవత్సరాల నుండి, ఇన్ని కోట్ల మంది ఎవరి నిర్బంధమూ లేకుండా, స్వచ్ఛందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా హిందూ మహిళలు తమ నోములేవో తాము నోచుకుంటున్నారంటే, వాళ్లకు వాటి వల్ల ఏదో ఒక ప్రయోజనం నెరవేరుతూ ఉండి ఉండాలి. కోరుకున్న కోరికలు తీరటం కావచ్చు. మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం, తృప్తి, ధైర్యం, ఉత్సాహం పెరగటం కావచ్చు. ఐహిక ఆముష్మిక కోరికలు తీరటం కావచ్చు. ఆముష్మిక చింతన మీదకు వారి ధ్యాస మళ్లటం కావచ్చు. ఇలాంటి ప్రయోజనం ఏదీ లేకుండా ఎవరైనా ఏ పనైనా చేస్తారనడం అటు హేతువాదానికి, ఇటు అనుభవానికి రెండింటికి విరుద్ధమే అవుతుంది కదా!
వీరి సంగతి ఇతరులకు తెలియకపోవచ్చు. లేదా అర్థం కాకపోవచ్చు. ఒక్కొక్కసారి వీరు చెప్పే దానిని ఒక ప్రయోజనంగా కూడా అవతలివారు అంగీకరించకపోవచ్చు. వీరి ధ్యాస ప్రయోజన శూన్యంగా అవతలివారికి కనిపించవచ్చు. ఎవరి సంస్కారాలను బట్టి వారి బుద్ధి పనిచేస్తుంది. అంతెందుకు.. మొన్న మొన్నటి దాకా మనదేశ సంస్కృతిలో గ్రామీణ సంప్రదాయాల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. ఈ మధ్యకాలంలో పాశ్చాత్య సంస్కృతికి బానిసలైన కారణంగా ఈ సంస్కృతి క్రమక్రమంగా కనుమరుగైపోతుంది ఏమో! అన్న బాధ సంస్కృతి ప్రేమికులకు కలగక మానదు. అయితే గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల జీవన విధానం, వారి దైనందిన సీదా సాదా విధానం మనకు కనబడుతుంది. వాళ్లు అల్పసంతోషులు. వారికి అవసరాలు తక్కువ. చిన్న చిన్న విషయాలలో గొప్ప గొప్ప సంతోషాలను అనుభవించగలగడమే వారికున్న సహజత్వం. వారు ఉదర పోషణకు, కుటుంబ రక్షణకు చేయగలిగిందేదో చేసుకున్న తర్వాత అవి ఆలోచించేందుకు ఇప్పటికంటే ఎక్కువ సమయం వారికి మిగిలేది.
:: ఆత్మీయతలను పెంచే ఆధ్యాత్మికత ::
తమ భోగభాగ్యాలు కష్టసుఖాలు వీలైనన్ని సందర్భాలలో సాటివారితో పంచుకోవాలన్న సాంఘిక బాధ్యతను, నియమాన్ని ఆధ్యాత్మికతతో పెనవేసే కార్యక్రమాలను అజ్ఞానము, అవివేకము అనలేము. ప్రపంచ వ్యాప్తంగా కొత్తొక వింతగా కనిపిస్తూ నిత్య ఉత్సవాలు జరుపుకునే ఈ రోజులలో అసలే అనలేం! పురుష ప్రయత్నం వదిలేసి పుణ్యకాలమంతా నోములు, వ్రతాలు అంటూ కూర్చుంటే పురోగతి ఎలా సాధిస్తాం? అని, మరొక అభ్యంతరం వినిపిస్తూ ఉంటుంది. కానీ సాధారణంగా ఎవరు అలా కూర్చోరు. ఇది చేస్తే అది చేయాల్సిన పనిలేదని కాదు. ధనార్జన చేయగోరేవారు స్నాన, పానాలకు, ఆహార, విహారాలకు సమయం కేటాయించరా? వాస్తవానికి పూజలు, నోములు, ప్రార్థనలు, వ్రతాలు పురుష ప్రయత్నానికి పరమాత్ముని అనుగ్రహం కూడా తోడైతే విజయం తథ్యం! అన్న నమ్మకానికి ఆచరణ రూపాలు మాత్రమే! ఈ నోములన్నింటిలోనూ యధాశక్తి బంధుమిత్రులను ఆహ్వానించి సత్కరించటం, కానుకలు పంచుకోవడం కనిపిస్తుంది. సాటివారిని పేరంటాల పేరుతో సాదరంగా, అభిమానంగా, ఆత్మీయంగా ఆహ్వానించటం.. వాళ్లూ అదే విధంగా ఆత్మీయంగా, అభిమానిగా వచ్చి నోము నిర్వహణలో తమ సంపూర్ణ సహకారాన్ని అందించి, సౌజన్యం, సహృద్భావం ప్రకటించి వెళ్లడం జరుగుతూ ఉంటాయి.
"సాహిత్య కళా విభూషణ" స్వర్ణ నంది పురస్కార గ్రహీత
చౌడూరి నరసింహారావు, సాహిత్య, సామాజిక విశ్లేషకులు
భాగ్యనగరం, 9705100788
