రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటాం
జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్ధిపేట:
సిద్ధిపేట,ఏప్రిల్ 10 ( భారత శక్తి )
హుస్నాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమిని కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. భూ సేకరణ ప్రక్రియకు రైతులు సహకరించాలని ఆమె కోరారు.శుక్రవారం హుస్నాబాద్ సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ కారణంగా భూములు కోల్పోతున్న అక్కన్నపేట మండలం చౌటపల్లి, జనగామ, తోటపల్లి గ్రామాల రైతులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండల పరిధిలోని చౌటపల్లి, జనగామ, తోటపల్లి గ్రామాల్లో సుమారు 124 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించి ఇండస్ట్రియల్ పార్క్గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ పార్క్ ద్వారా పరిశ్రమలు స్థాపించబడటంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. ప్రాంత అభివృద్ధి కోసం భూమిని ఇవ్వడంలో రైతులు సహకరించాల్సిన అవసరం ఉందని, భూమిని కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ నియమావళి ప్రకారం తగిన నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భూమి అప్పగింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి రైతులు ముందుకు రావాలని సూచించారు.ఈ సమావేశంలో ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
.jpeg)
