అమీన్పూర్లో రూ. 47 కోట్ల పార్కు స్థలాల రక్షణ
కబ్జా కోరల నుంచి కాపాడిన హైడ్రా.. 5797 గజాల చుట్టూ ఫెన్సింగ్
అమీన్పూర్;
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో కబ్జా ముప్పు పొంచి ఉన్న రెండు పార్కు స్థలాలను హైడ్రా అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 5,797 గజాల విస్తీర్ణం కలిగిన ఈ స్థలాల విలువ సుమారు రూ. 47 కోట్లు ఉంటుందని అంచనా.
అసలేం జరిగిందంటే?
అమీన్పూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 152, 153లలో గతంలో శ్రీ వెంకటరమణ కాలనీ పేరిట 15 ఎకరాల్లో 144 ప్లాట్లతో లేఅవుట్ వేశారు. అప్పట్లో మునోత్ ప్రైవేట్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న పవర్ లాల్ దీనికి హుడా (HUDA) అనుమతి పొందారు. అయితే 2012లో బాధ్యతలు చేపట్టిన మహాకుమార్ జైన్.. ఇందులో 7 ఎకరాలను వ్యవసాయ భూమిగా పేర్కొంటూ ఇతరులకు విక్రయించారు. ఈ 7 ఎకరాల వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.
ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకుని మిగిలిన 8 ఎకరాల లేఅవుట్లోని పార్కు స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంకటరమణ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రా 'ప్రజావాణి'లో ఫిర్యాదు చేశారు. లేఅవుట్ నిబంధనల ప్రకారం కేటాయించిన 4960 గజాల ఒక పార్కు, 837 గజాల మరో పార్కును కాపాడాలని కోరారు.
రంగంలోకి హైడ్రా అధికారులు:
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇతర శాఖల అధికారులతో కలిసి పాత లేఅవుట్ రికార్డులను పరిశీలించి పార్కు స్థలాలను గుర్తించారు. అనంతరం ఆ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఇవి 'పార్కు స్థలాలు' అని తెలిపే బోర్డులను పాతారు. అన్యాక్రాంతం కాకుండా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడటంపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
