ఉప్పల్ స్టేడియం ఖాకీ పహారా!
- ఐపీఎల్ మ్యాచ్ల కోసం పటిష్ట బందోబస్తు
- 2 వేల మంది పోలీసులతో నిఘా.. 430 సీసీ కెమెరాల మానిటరింగ్
- ఇయ్యాల్టి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. స్టేడియంలోకి ఆ వస్తువులొద్దు!
హైదరాబాద్:
సిటీలో క్రికెట్ జాతర షురూ కానుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్-2026 మ్యాచ్ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 05 నుంచి మే 22 వరకు జరిగే ఈ పోరులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మల్కాజిగిరి పోలీసులు స్టేడియాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. సుమారు 39 వేల మంది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
2 వేల మందితో బందోబస్తు:
మ్యాచ్ల కోసం సుమారు 2,000 మంది పోలీస్ సిబ్బందిని రంగంలోకి దించారు. లా అండ్ ఆర్డర్ నుంచి 750 మంది, ట్రాఫిక్ విభాగం నుంచి 300 మందితో పాటు టీఎస్ఎస్పీ, ఏఆర్ ఫోర్స్ బలగాలు విధుల్లో ఉండనున్నాయి. 20 మౌంటెడ్ పోలీస్ (గుర్రపు స్వారీ) టీమ్స్, 10 వజ్ర వాహనాలు సిద్ధంగా ఉంచారు. స్టేడియం లోపల, బయట కలిపి 430 సీసీ కెమెరాలతో జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం నిఘా పెట్టనున్నారు. గేట్ నెం.1 నుంచి కేవలం ప్లేయర్లను మాత్రమే అనుమతిస్తారు.
స్టేడియంలోకి వచ్చే ప్రేక్షకులపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. తనిఖీల్లో భాగంగా ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లను మొబైల్ టెక్నీషియన్లు చెక్ చేస్తారు.
నిషేధిత వస్తువులు: ల్యాప్టాప్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, లైటర్లు, అగ్గిపెట్టెలు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, పర్ఫ్యూమ్స్, బ్యాగులు, బయటి తిండి పదార్థాలు.
ముఖ్య గమనిక: స్టేడియం దగ్గర ఐటమ్స్ దాచుకోవడానికి క్లోక్ రూమ్ సౌకర్యం లేదు. అందుకే ఈ వస్తువులను తెచ్చుకోకపోవడమే బెటర్.
మ్యాచ్లు జరిగే టైంలో ఉప్పల్ వైపు భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
మళ్లింపు: ఘటకేసర్ నుంచి వచ్చే లారీలు, ప్రైవేట్ బస్సులను మెహఫిల్ దగ్గర నాగోల్ వైపు మళ్లిస్తారు.
ఎల్బీనగర్ నుంచి వచ్చే వాటిని నాగోల్ మెట్రో దగ్గర మళ్లిస్తారు.
పార్కింగ్: హబ్సిగూడ వైపు వచ్చే వాళ్లు పెంగ్విన్ గ్రౌండ్స్లో, రామంతాపూర్ వైపు వచ్చే వాళ్లు DSL ఓపెన్ ప్లేస్లో వాహనాలు పార్క్ చేయాలి.
సూచన: ట్రాఫిక్ కింద పడకుండా ఉండాలంటే ప్రేక్షకులు మెట్రో లేదా ఆర్టీసీ బస్సుల్లో రావడం ఉత్తమమని పోలీసులు సూచించారు.
ప్రత్యేక నిఘా.. సేవలూ రెడీ.
షీ టీమ్స్: స్టేడియంలో ఈవ్ టీజింగ్ జరగకుండా షీ టీమ్స్ నిఘా వేసి ఉంచుతాయి.
ఎమర్జెన్సీ: అత్యవసర చికిత్స కోసం 5 అంబులెన్సులు, అగ్నిప్రమాదాల నివారణకు 4 ఫైర్ ఇంజన్లను స్టేడియం వద్దే అందుబాటులో ఉంచారు.
డిజిటల్ టికెట్స్: ఏప్రిల్ 13 నుంచి జరిగే మ్యాచ్లకు డిజిటల్ టికెటింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
