మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు
- రూ. 50 వేల జరిమానా విధిస్తూ ఎల్బీనగర్ కోర్టు తీర్పు
- బాధితురాలికి మరో రూ. 50 వేల పరిహారం
సరూర్ నగర్:
మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు ఎల్బీనగర్లోని అత్యాచార మరియు పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చింది. జైలు శిక్షతో పాటు నిందితుడికి రూ. 50,000 జరిమానా, బాధితురాలికి రూ. 50,000 పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
కేసు నేపథ్యం:
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్కు చెందిన చింతపల్లి నవీన్ కుమార్ (23) కూలీ పనులు చేసుకునేవాడు. సెప్టెంబర్ 2023లో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక తన సోదరి ఇంటి నుంచి హాస్టల్కు వెళ్తుండగా, నవీన్ ఆమెకు పరిచయమయ్యాడు. తన బైక్పై హాస్టల్లో దింపుతానని నమ్మించి బాలికతో పాటు ఆమె స్నేహితురాలిని తన ఇంటికి తీసుకెళ్లాడు. మూడు రోజుల పాటు వారిని అక్కడే ఉంచాడు. బాలిక చదువుతున్న పాఠశాల యాజమాన్యానికి ఫోన్ చేసి, తాను ఆమె బాబాయ్ని అని అబద్ధం చెప్పి తప్పుదోవ పట్టించాడు. అనంతరం సెప్టెంబర్ 6న వారిని వదిలిపెట్టగా, బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తు అధికారులు సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడు నవీన్ కుమార్ నేరం చేసినట్లు రుజువు కావడంతో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.
అధికారుల అభినందన:
ఈ కేసులో పక్కాగా దర్యాప్తు జరిపి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఎస్సై జె. గణేష్ బాబు, ప్రస్తుత ఎస్సై పి. మాధవ రావులను సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ ఎన్. శ్రీశైలం ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.
