పటాన్చెరు:
పటాన్చెరు డివిజన్ పరిధిలోని సింపని పార్క్ హోమ్స్ లో గల కాలనీ స్థలాలను ఆక్రమణలకు గురి కాకుండా పరిరక్షిస్తామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కాలనీవాసులకు భరోసా అందించారు. గజం స్థలం సైతం కబ్జా కానివ్వమని తెలిపారు.
కాలనీ ఏర్పాటు చేసిన సమయంలో కాలనీ అవసరాల కోసం ఆరు వేల గజాల స్థలాన్ని సంబంధిత బిల్డర్ కేటాయించడం జరిగిందని.. తదనంతరం బిల్డర్ స్వార్థంతో కొందరు వ్యక్తులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని.. ఈ అంశంపై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ..ఇటీవల కొందరు ఆ భూమి తమకు రిజిస్ట్రేషన్ చేశారంటూ కబ్జా చేసేందుకు ప్రయత్నించడం జరుగుతోందంటూ కాలనీవాసులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ అంశంపై చర్చించేందుకు ఆదివారం ఉదయం సింఫనీ పార్క్ హోమ్స్ కమ్యూనిటీ లో నివసిస్తున్న గృహ యజమానులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా కాలనీ అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని బిల్డర్ కక్కుర్తి తో ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడం చట్టపరంగా నేరమని తెలిపారు. చట్టం ప్రకారం ఈ స్థలం కాలనీకి చెందుతుందని తెలిపారు. ఈ అంశంలో ఎవరైనా తమ స్థలం అంటూ బలప్రయోగానికి దిగితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాలనీ వాసులు ధైర్యంగా ఉండాలని.. ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు.. ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించడంతోపాటు రామాలయం, శివాలయం, అమ్మవారి దేవాలయాలను సైతం సొంత నిధులతో నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
2016లో కాలనీ ఏర్పాటైన నుండి నేటి వరకు అన్ని అంశాల్లో అండగా ఉంటూ తమ కాలనీకి కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని దిశా కమిటీ సభ్యులు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కాసాల సుధాకర్ అన్నారు. కాలనీ అభివృద్ధిలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాత్ర మరువలేనిదని అన్నారు. తాము ఎల్లప్పుడూ ఆయనకు అండగా ఉంటామని తెలిపారు. కాలనీలో మౌలిక వసతుల కోసం కేటాయించిన స్థలం అంశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సహకారానికి కాలనీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
