సిరిసిల్లలో తీవ్ర ఉద్రిక్తత...

నేతన్న చౌరస్తా వద్ద రణరంగంగా మారిన బీజేపీ-బీఆర్ఎస్ ధర్నా..

సిరిసిల్లలో తీవ్ర ఉద్రిక్తత...

భారత శక్తి,:

జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. పట్టణంలోని నేతన్న చౌరస్తా వేదికగా ప్రతిపక్ష పార్టీల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా చేపట్టిన ధర్నా కార్యక్రమం కాస్తా, పరస్పర దాడులు, ఘర్షణలతో రణరంగంగా మారింది. బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలని బిఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనాతో 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇరు పార్టీలు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు నేతన్న చౌరస్తాకు చేరుకున్నారు. ఒకరినొకరు.. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు, ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి, తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చూస్తుండగానే ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం చెప్పులతో దాడులకు దిగారు. నెట్టుకోవడాలు, చెప్పుల దాడిలతో చౌరస్తా ప్రాంతం అంతా గందరగోళంగా మారింది. కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి చేరడంతో స్థానికులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు. ​పరిస్థితి చేతులు దాటిపోతుండటంతో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే స్వయంగా రంగంలోకి దిగారు. భారీగా పోలీస్ బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షించారు. ఎంత సర్దిచెప్పినా వినకుండా, పోలీసులకు ముప్పుతిప్పలు పెడుతున్న ఉభయ పార్టీల నేతలను, కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు. నిరసనకారులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ​ఈ హఠాత్పరిణామంతో సిరిసిల్ల ప్రధాన రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నేతన్న చౌరస్తా వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో ప్రస్తుతం ప్రశాంతత ఉన్నప్పటికీ, అంతర్గతంగా తీవ్ర రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది.

About The Author