జనాభా గణన పక్కాగా జరగాలి
- శంషాబాద్లో హౌస్ లిస్టింగ్ ప్రక్రియను తనిఖీ చేసిన కమిషనర్ ఆర్.వి. కర్ణన్
- జూన్ 9 లోగా ప్రక్రియ పూర్తికి ఆదేశం
హైదరాబాద్:
జనాభా లెక్కల సేకరణలో క్షేత్రస్థాయిలో ఎలాంటి తప్పులు జరగకూడదని, ప్రతి ఇంటి డేటా పక్కాగా నమోదు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశించారు. శంషాబాద్లోని ఎన్యూమరేషన్ బ్లాక్ నంబర్లు 83, 94లలో కొనసాగుతున్న జనాభా లెక్కల గృహాల జాబితా (హౌస్ లిస్టింగ్) ప్రక్రియను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ చంద్రకళ, డిప్యూటీ కమిషనర్ సుమన్ రావుతో కలిసి క్షేత్రస్థాయి అమలు తీరును సమీక్షించారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
గృహాల జాబితా నమోదులో ఎన్యూమరేటర్లు అనుసరిస్తున్న విధానాలను కమిషనర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో మాట్లాడి డేటా సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగారు. రికార్డుల నమోదులో ఖచ్చితత్వం పాటించాలని, ఏ ఒక్క ఇంటిని వదలకుండా ప్రతి గడపకూ వెళ్లాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రక్రియను నెల రోజుల్లోగా, అంటే జూన్ 9 నాటికి పూర్తి చేయాలని అధికారులకు డెడ్ లైన్ విధించారు. జనాభా గణన విధులకు ఆటంకం కలగకుండా సంబంధిత ఫీల్డ్ అధికారులు, బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్స్పెక్టర్లను వెంటనే ఈ విధుల్లో నియమించాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.
పౌరులు సహకరించాలి*
"దేశాభివృద్ధికి కీలకమైన జనాభా లెక్కల సేకరణలో ప్రజలు భాగస్వాములు కావాలి. ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు సరైన సమాచారం అందించి సహకరించాలి."
ఆర్.వి. కర్ణన్, కమిషనర్
