రాజుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు.. తగ్గని శ్రీవారి కానుకల వైభవం

తిరుపతి జిల్లా ప్రతినిధి :

శతాబ్దాలుగా కొనసాగుతున్న శ్రీవారికి కానుకల సమర్పణ
శ్రీకృష్ణదేవరాయల కాలంలో అపూర్వ ఆభరణాల బహూకరణ
వివిధ మతాల వారు కూడా సమర్పించిన విలువైన కానుకలు
ఆధునిక కాలంలోనూ కోట్లాది రూపాయల విలువైన కిరీటాలు, హారాలు
భక్తికి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న శ్రీవారి ఆభరణాలు

WhatsApp Image 2025-10-01 at 6.27.12 PM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై భక్తికి, సమర్పించే కానుకలకు యుగాల చరిత్ర ఉంది. రాజుల కాలం నుంచి నేటి ఆధునిక పారిశ్రామికవేత్తల వరకు, హిందూ మతస్థులే కాకుండా ఇతర మతాల వారు సైతం ఏడుకొండలవాడికి విలువైన ఆభరణాలను సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ కానుకల వెనుక ఉన్నది కేవలం బంగారం, వజ్రాల విలువ కాదు.. యుగాలుగా కోట్లాది భక్తులు స్వామివారిపై కురిపిస్తున్న అచంచలమైన భక్తి, విశ్వాసం.

12వ శతాబ్దం నుంచి శ్రీవారికి కొనసాగుతున్న కానుకలు
12వ శతాబ్దం నుంచే శ్రీవారికి కానుకలు అందించే సంప్రదాయం ఉన్నప్పటికీ, విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఇది శిఖరస్థాయికి చేరింది. ఆయన 1513లో రెండు వేర్వేరు సందర్భాల్లో వజ్రాలు, కెంపులతో పొదిగిన కిరీటంతో పాటు నవరత్న ఖచిత ఆభరణాలు, స్వర్ణఖడ్గం వంటివి స్వామివారికి సమర్పించి తన భక్తిని చాటుకున్నారు. ఆకాశరాజు, తొండమాన్‌ చక్రవర్తి వంటి ఎందరో రాజులు స్వామివారికి అపురూప ఆభరణాలు అందించిన వారిలో ఉన్నారు.

మతాలకు అతీతంగా ఏడుకొండలస్వామికి కానుకల వెల్లువ
స్వామివారిపై భక్తి కేవలం హిందువులకే పరిమితం కాలేదు. బ్రిటిష్‌ పాలనలో చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన థామస్‌ మన్రో స్వామివారికి ఒక పెద్ద గంగాళాన్ని కానుకగా ఇచ్చారు. అలాగే గుంటూరుకు చెందిన షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ మీరా వంటి వారు 108 బంగారు పుష్పాలను స్వామివారి పూజ కోసం సమర్పించడం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

ఆధునిక కాలం కానుకలు
రాజుల కాలం నాటి సంప్రదాయం నేటికీ అదే వైభవంతో కొనసాగుతోంది. ఆధునిక కాలంలోనూ శ్రీవారికి అత్యంత విలువైన కానుకలు అందుతున్నాయి. 2009లో గాలి జనార్దనరెడ్డి సుమారు 42 కోట్ల రూపాయల విలువైన వజ్రకిరీటాన్ని సమర్పించారు. అలాగే, గోయంకా కుటుంబం 10 కిలోల బంగారు కిరీటాన్ని, పెన్నా సిమెంట్స్‌ సంస్థ 5 కోట్ల రూపాయల విలువైన వజ్రాల కటి, వరద హస్తాలను కానుకగా అందించారు.

తిరుమల శ్రీవారి ఆభరణాలు.. తరగని భక్తికి నిలువుటద్దం
రత్నకిరీటం, మేరు పచ్చ, సహస్రనామ హారం, సూర్య కఠారి వంటి అపురూప ఆభరణాలు ఉత్సవాల సమయంలో శ్రీవారి శోభను మరింత పెంచుతాయి. ఈ ఆభరణాలన్నీ కేవలం స్వామివారి ఖజానాకు అలంకారాలు కావు, తరతరాలుగా భక్తులు ఆయనపై చూపుతున్న ప్రేమకు, విశ్వాసానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అందుకే ఆయన ‘సిరి’నివాసుడిగా భక్తులచే పూజలందుకుంటున్నారు.

About The Author

Related Posts