పేదల దీవెనలతోనే ఇందిరమ్మ ప్రభుత్వం
ఖమ్మం (భారత శక్తి ప్రతినిధి ) జూలై 30:పేదల దీవెనలతోనే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఆ ప్రభుత్వ తప్పిదాల వల్ల కోట్లాది పేదలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక 16 లక్షల మందిని కొత్తగా పాత కార్డుల్లో చేర్చామని తెలిపారు.
ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి, మూడు నెలలకు ఒకేసారి ఇచ్చామని గుర్తుచేశారు. గతంలో రైతులకు వరి వేస్తే ఉరి అనిపించగా, ఇప్పటి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తోందని చెప్పారు. పది నెలల్లో 21 వేల కోట్ల రుణమాఫీ జరిపినట్లు పేర్కొన్నారు.

మహిళల సంక్షేమంపై దృష్టి సారించామని, ఉచిత బస్సు ప్రయాణానికి 5 వేల కోట్లు అదనంగా ఖర్చు చేస్తూ భారంగా భావించడం లేదని మంత్రి స్పష్టం చేశారు. “కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతోంది” అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయని, మూడు విడతల్లో పేద కుటుంబాలకు ఇళ్లు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు. “ప్రతి అర్హుడికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. పేదల ఇంటి పెద్ద కొడుకులా నేను మీతో ఉంటాను” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author
02 Aug 2025