పరకాల పట్టణం అభివృద్ధి చెందాలి

ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)జూలై29: పరకాల పట్టణం దినదినం  అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.మంగళవారం పరకాల పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో  15వ ఆర్థిక సంఘం, టైడ్ గ్రాంట్స్ ద్వారా రూ. 47.74 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన జెసిబి యంత్రం, అదేవిధంగా రూ. 87.55 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఆరు స్వచ్ఛ ఆటో లను  హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అధికారులు, స్థానికుల సమక్షంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి  ప్రారంభించారు. పారిశుద్ధ్య సిబ్బందికి ఎమ్మెల్యే, కలెక్టర్ల చేతుల మీదుగా దుస్తుల పంపిణీ చేశారు.
1000002902

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా  పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో  ఎమ్మెల్యే, కలెక్టర్ మొక్కలు నాటారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా  మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  ఫుడ్ ఫెస్టివల్  స్టాల్స్ ను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. మహిళా సంఘాల ఉత్పత్తుల  ప్రదర్శన, అమ్మకాల స్టాల్స్ ను  ఎమ్మెల్యే, కలెక్టర్  పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని  ప్రభుత్వం అనేక ప్రాధాన్య కార్యక్రమాలతోపాటు పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యత నిస్తుందన్నారు. గ్రామాలు, పట్టణ ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతని ఇస్తుందని, ప్రజా ప్రతినిధుల బాధ్యత కూడా అని  పేర్కొన్నారు. పరకాల పట్టణంలోని పలు డివిజన్లను పరిశీలించినప్పుడు  34 వేలకు  పైగా  జనాభా ఉన్నారని, పరకాల పట్టణం దినదినం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. పరకాలకు  చరిత్ర ఉందని అన్నారు. రజాకార్ల ఉద్యమంలో, స్వాతంత్ర్య ఉద్యమంలో ఇక్కడి నుండి పాల్గొన్న వారు ఉన్నారని గుర్తుకు చేశారు. ఇక్కడ ఉద్యమకారులు రజాకారుల చేతుల్లో ఊచ కోత కోయబడ్డారని  అన్నారు. దానికి గుర్తుగా రకాల పట్టణంలో  అమరధామం నిర్మించారని  పేర్కొన్నారు.

ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ పరకాల పురపాలక సంఘానికి ఒక్కో స్వచ్ఛ ఆటోను 15 లక్షల వ్యయంతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రజలు తడి పొడి చెత్తగా వేరు చేయాలని సూచించారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో చెత్త, వ్యర్ధాల నిర్వహణ సమస్యగా మారిందన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక  లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో  మహిళలకు తడి పొడి చెత్త నిర్వహణకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాలనీల్లో కంపోస్టు యూనిట్ ను ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి  మహిళలు ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు  స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను  ఏర్పాటు చేసి  నైపుణ్యాలను పెంపొందించే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలకు అందిస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరకాలకు  ఇందిరమ్మ ఇండ్లు పెద్ద ఎత్తున మంజూరు చేయడం జరిగిందని, వాటి పురోగతి తక్కువగా ఉందన్నారు. ఇంకా ఇండ్ల నిర్మాణ పనులు మొదలుపెట్టనివి వంద వరకు ఉన్నాయన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించుకొని వారికి మెప్మా ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలను ఇప్పిస్తామన్నారు. వారం రోజుల్లో ఇండ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టాలని, నిర్మాణ పనులు మొదలుపెట్టిన లబ్ధిదారులు త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, పరకాల పురపాలక సంఘం కమిషనర్ సుష్మ, ఆర్డిఓ డాక్టర్ కే నారాయణ, తహసిల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో ఆంజనేయులు, స్థానిక ప్రజాప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
 
 
 

About The Author