బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :

గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసిక జిల్లా కన్సాలిటేటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రుణ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడానికి బ్యాంకర్లు, అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. వెనుకబడిన తరగతుల ప్రజలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతులు, వీధి వ్యాపారులు, విద్యార్థులకు రుణ మంజూరులో ఆలస్యం చేయకుండా చూడాలని ఆదేశించారు. అర్హులైన దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రుణాలు అందజేయాలని స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై ప్రజలకు బ్యాంకు సిబ్బంది అవగాహన కల్పించాలని, విస్తృత అవగాహన ద్వారానే సైబర్ నేరాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ప్రజలకు ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా అందజేసిన రుణాల వివరాలు, వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. బ్యాంకులకు వచ్చే ప్రతి ఒక్కరికీ సమయానుకూలంగా, మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, నాబార్డు డిడిఎం వీరభద్రుడు, ఆర్బీఐ ఏజీఎం శ్రీనివాస్, ఆయా శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
