ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువులను స్టాక్ బోర్డుల్లో ప్రదర్శించాలి..


1000002816ఊమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో (భారతశక్తి)జూలై 29: నిర్మల్ జిల్లా ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలన్నీ రైతులకు తెలిసేలా స్టాక్ బోర్డుల్లో ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం మామడ మండలంలో గల గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా దుకాణానికి సంబంధించిన వివరాలు కంప్యూటర్లో పరిశీలించారు. క్రయ విక్రయాలకు సంబంధించి రసీదు పుస్తకాలను తనిఖీ చేశారు. దుకాణంలో అందుబాటులో ఉన్న యూరియా, ఎరువులు, ఇతర పురుగుల మందుల వివరాలను ఎరువుల దుకాణ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
రైతులకు గుర్తింపు పొందిన సంస్థలు తయారు చేసే నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులను మాత్రమే విక్రయించాలని పేర్కొన్నారు. రైతులకు వారువేసిన పంటను బట్టి, భూసారాన్నిబట్టి తగిన మోతాదులో అవసరమైనన్ని ఎరువులను ఇవ్వాలన్నారు. జిల్లాలో తగినంత యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. యూరియా, ఇతర ఎరువుల క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలన్నీ జాగ్రత్తగా పొందుపరచాలని సూచించారు. గడువు ముగిసిన పురుగుల మందులను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించవద్దని తెలిపారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
 
 
 

About The Author