పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ..

ఖమ్మం ప్రతినిది :

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశమైన జిల్లా కలెక్టర్

WhatsApp Image 2025-09-30 at 8.32.29 PM

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీలు, ఎంపిటిసి, జెడ్పిటిసి) ఎన్నికలను పారదర్శకంగా నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి  తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  అనుదీప్  దురిశెట్టి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికలను పారదర్శకంగా, ఎన్నికల నియమావళి ప్రకారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

జిల్లాలో మొత్తం 20 మండలాల్లో 571 గ్రామ పంచాయతీలు, 5214 వార్డులు, 99 షెడ్యూల్డ్ ప్రాంతం గ్రామ పంచాయతీలు, 461 నాన్ షెడ్యూల్డ్ ప్రాంతం గ్రామ పంచాయతీలు ఉన్నాయనీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 5214 గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లు, 737 కేంద్రాల్లో ఏర్పాటు చేశామని, మండల గుర్తింపు ప్రకారం 20 జెడ్పీటీసీలు, 283 ఎంపీటీసీలు, 1580 ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్లు, 593 ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 40 జోనల్ అధికారులు, 20 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు, 16 ఎస్.ఎస్.టి. టీములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జులై 10 నాటికి ఉన్న ఓటర్ల వివరాల ప్రకారం పురుషులు 3,88,243, మహిళలు 4,14,425, ఇతరులు 22 మంది కలిపి మొత్తం 8,02,690 మందికి ఓటు వేయడానికి అవకాశం ఉందని తెలిపారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ రెండు విడతల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మూడు విడతల్లో నిర్వహించనున్నామని,  ప్రతి విడతలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కు అనుగుణంగా నామినేషన్, పరిశీలన, పోలింగ్ తేదీలు నిర్ణయించామని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నుండి వెంటనే అమలులోకి వచ్చిందని తెలిపారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, డిపిఓ ఆశాలత, డివిజనల్ పంచాయతీ అధికారులు రాంబాబు, విజయలక్ష్మి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

About The Author