అగ్నిమాపక ప్రమాదాలపై అవగాహన
- - ఫైర్ సేఫ్టీ తప్పనిసరి ఉండాలని సూచన
- - ఇంచార్జ్ ఎస్ఎఫ్వో ఎల్. సికిందర్
సిద్దిపేట:
సిద్దిపేట పట్టణంలోని లహరి అపార్ట్మెంట్లో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంచార్జ్ ఎస్ఎఫ్వో ఎల్. సికిందర్ హాజరై అపార్ట్మెంట్ నివాసితులకు అగ్ని ప్రమాదాల నివారణపై కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్వో ఎల్. సికిందర్ మాట్లాడుతూ గృహాలలో గ్యాస్ లీకేజీలు, విద్యుత్ లోపాలు, నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, గ్యాస్ సిలిండర్లను సురక్షితంగా ఉపయోగించాలని సూచించారు.అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని, ప్రారంభ దశలోనే మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎలక్ట్రికల్ పరికరాలను జాగ్రత్తగా వినియోగించడం, ఓవర్లోడ్ను నివారించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.అపార్ట్మెంట్లలో ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో బయటపడే మార్గాలను ముందుగానే తెలుసుకోవాలని నివాసితులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ నివాసితులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
