వీడిన హత్య కేసు మిస్టరీ.. 

హత్యకు వివాహేతర సంబంధమే కారణం.. 
నిందితులు అరెస్టుచేసి వివరాలు వెల్లడి.. 

WhatsApp Image 2025-08-05 at 4.48.32 PMకరీంనగర్: నగర శివారులోని బొమ్మకల్ ఫ్లైఓవర్ ప్రాంతంలోగల రైల్వే ట్రాక్ పక్కన జరిగిన హత్య కేసు మిస్టరీని కరీంనగర్ రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ సీపీ గౌస్ అలం తెలిపారు...మంగళవారం నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘటన వివరాలను తెలియజేశారు. గత నెల జులై 29న సుభాష్ నగర్ కు చెందిన ఐలవేణి సంపత్ (45) రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రంథాలయంలో స్వీపర్‌గా పనిచేసిన సంపత్, తన కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో  భాగంగా మృతుడి భార్య ఐలవేణి రమాదేవి (38)పై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని ఆ దిశగా విచారించారని చెప్పారు.

వెల్లడైన సంచలన విషయాలు
రమాదేవికి కిసాన్ నగర్ కు చెందిన కర్రె రాజయ్య (50) తో వివాహేతర సంబంధం ఉంది. భర్త సంపత్ మద్యానికి బానిస కావడంతో తరచూ రమాదేవిని కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన రమాదేవి, రాజయ్య, తన దూరపు బంధువైన కీసరి శ్రీనివాస్ (35) (ఖాదర్ గూడెం) లతో కలిసి సంపత్‌ను హత్య చేయాలని ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం, రాజయ్య, శ్రీనివాస్ కలిసి సంపత్‌ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు రమ్మని చెప్పి, అక్కడ మద్యం తాగారని తెలిపారు. సంపత్ పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత, రమాదేవి ఫోన్ చేసి అతడిని చంపమని వారికి ఫోన్ ద్వారా చెప్పడంతో ఆ మేరకు రాజయ్య, శ్రీనివాస్ తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందు (హెర్బిసైడ్)ను సంపత్ చెవిలో పోసి హత్య చేశారని రమాదేవి పోలీసు విచారణలో వెల్లడించిందనీ చెప్పారు. సంపత్ చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని, ఆ తర్వాత, రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ ముగ్గురూ కలిసి సంపత్ కోసం వెతుకుతున్నట్లు నటించారనీ చివరికి సంపత్ మృతదేహం ఉన్న ప్రాంతాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని తెలియజేశారు. అరెస్ట్ అయిన నిందితులు నగరంలోని కిషన్ నగర్ కు చెందిన కర్రె రాజయ్య (50)   అలియాస్  రాజు అలియాస్ రాజన్న, ఖాదర్ గూడెం కు చెందిన  కీసరి శ్రీనివాస్ (35), బుట్టిరాజారాం కాలానికి చెందిన మృతుడి భార్య ఐలవేణి రమాదేవి (38)లు ఉన్నారు. ఈ హత్యకు ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లను, మద్యం బాటిళ్లు , గడ్డి మందు (హెర్బిసైడ్) డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  హత్య కేసును చాకచక్యంగా  వ్యవహరించి మిస్టరీని చేధించిన కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై లు తాండ్ర నరేష్, లక్ష్మా రెడ్డి, పోలీసుల బృందాన్ని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.

Read More గోవా మద్యం పట్టి వేత

About The Author