హైదరాబాద్లో భారీ వర్షాలు కురిస్తే నరకయాతన..
హైదరాబాద్ :
కాలనీలకు కాలనీలు మునిగిపోతున్నాయి... దీనికి పరిష్కారం అనేది లేదా..? కాంక్రీట్ జంగిల్ గా మారిపోయిన మహానగరం.. నాలాల ఆక్రమణ, అధికారుల నిర్లక్ష్యం.. భవిష్యత్ తరాల వారిని అంధకారంలో ముంచేస్తున్న వైనం.. వర్షం వచ్చిందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.. ప్రస్తుతం విభిన్న వాతావరణం నెలకొంది.. పగలంతా భరించలేని ఎండ.. సాయంత్రం అయితే భయంకరమైన వర్షం.. స్తంభించిపోతున్న జనజీవనం.. ఎవరిపాపమో ఎరుగం.. వర్షపు నీరు వెళ్లేందుకు దారిలేదు.. తప్పించుకునే మార్గం లేదు.. చెరువులను చెరబట్టడమే దీనికి మరో కారణం..హైడ్రా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏమి చేస్తున్నాయో అర్ధం కాని పరిస్థితి..
" ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న వాస్తవాలు..
వర్షం కురిస్తే నీట మునిగిన కాలనీలు, వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, జలమయమైన అనేక ప్రాంతాలు, ఎటు చూసినా ఎత్తైన ఆకాశ హర్మ్యాలతో కాంక్రీట్ జంగిల్ ని తలపించే కట్టడాలు, కట్టలు తెగి మురికి నీరుతో పొంగి ప్రవహిస్తున్న చెరువులు.. ఇదీ నేటి హైదరాబాద్ మహానగర పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మార్పు సంభవమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.. రోజు రోజుకూ పెరిగిపోతున్న జనాభా.. నివాసయోగ్యం లేని దౌర్భాగ్యం.. మురికివాడల్లో జీవనం వెల్లబోస్తున్న దారుణం.. నాలాల ఆక్రమణ.. ఆకాశ హర్మ్యాల నిర్మాణం.. విధి విధానాలు పాటించని నిర్మాణదారులు.. లంచాలకు దాసోహం అంటున్న ప్రభుత్వ అధికారులు.. స్వార్ధ ప్రయోజనాలకోసం వెంపర్లాడుతున్న రాజకీయ నాయకులు.. ప్రభుత్వాలు.. వెరసి నగర జీవితం అస్తవ్యస్తం అవుతోంది.. ప్రతి క్షణం నరకంగా మారుతోంది..
400 సంవత్సరాల సుదీర్ఘ సాంస్కృతిక చరిత్ర కలిగి దేశంలోనే రెండవ అతి పెద్ద మెట్రోపాలిటన్ నగరంగా అవతరించిన హైదరాబాద్ 1990వ దశకంలో వచ్చిన ఐటి విప్లవం కారణంగా ఐటి కారిడార్ గా పేరు పొందింది. 16 వ శతాబ్దంలో 3.5 చదరపు కిలోమీటర్ల ఉన్న నగర విస్తీర్ణం 7228 చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి విస్తరించి, ఒకప్పుడు చెప్పిన జనాభా లెక్కల ప్రకారం లక్షల్లో ఉన్న నగర జనాభా నేడు కోట్లకు చేరింది. ఇది 2030 నాటికి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన 28 మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తుందని అంచనా.
సాధారణంగా జులై నుంచి సెప్టెంబరు మధ్యలో హైద్రాబాదులో 80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలలో సగటున 5.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని లెక్కలు చెబుతున్నాయి..వాతావరణ నివేదిక చెబుతోంది.
హైదరాబాద్ నగరంలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా భారీ వర్షాలు కురిసినప్పుడు పలు ప్రాంతాలలో భారీగా నీరు ఇళ్లలోకి రావడంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.
దేశంలోనే రెండవ పెద్ద మెట్రోపాలిటన్ నగరంగా చెప్పుకునే హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసిన ప్రతి సారీ ఇటువంటి పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? దీనికి కేవలం అధిక వర్షపాతమే కారణమా? అధిక స్థాయిలో వర్షాలు కురవడం వలన మాత్రమే నగరాన్ని భారీ స్థాయిలో వరదలు ముంచెత్తాయని చెప్పలేమని నిపుణులు అంటున్నారు.
"హైదరాబాద్ నగరంలో వరదలు రావడం ఇది మొదటి సారి కాదు ఓల్డ్ సిటీలో చాలా ప్రాంతాలలో ఇప్పటికీ పురాతనమైన డ్రైనేజీ విధానమే కొనసాగుతోంది. అప్పట్లో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరగకపోవడం కూడా ఈ వరదలకు ఒక కారణం" అని విశ్లేషకులు చెబుతున్నారు.. 1956లో హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రారంభమైనప్పటి నుంచి ఈ నగరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. 2041 నాటికి నగర జనాభా ఒక కోటి 20 లక్షలకు చేరుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లోనే అంచనా వేసింది.
"అయితే, జనాభా పెరుగుదలకు తగిన రీతిలో మౌలిక సదుపాయాల కల్పన మాత్రం జరగలేదు అన్నది వాస్తవం.. అంటారు. కాగా 1908లో హైదరాబాద్ నగరానికి భారీ వరదలు వచ్చి నగరం మునిగినప్పుడు వరదలను నివారించేందుకు అవసరమైన ప్రణాళికలను సూచించాల్సిందిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నిజాం కోరారు.మూసీతోపాటు దాని ఉపనదిగా ఉండే ఈసీ పై కొన్ని జలాశయాలను నిర్మించాలని ప్రతిపాదిస్తూ విశ్వేశ్వరయ్య ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. మురుగునీటి పారుదలకు అవసరమైన సూచనలు చేశారు.
అప్పుడు నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థే ఇప్పటికీ చాలా పటిష్టంగా ఉంది.. కాకపొతే, దీనిని పూర్తిగా పునరుద్ధరించడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాని పని అన్నది మేధావులు అంటున్నారు.. హైదరాబాదు జనాభాలో 25 శాతం మంది మురికి వాడల్లోనే నివసిస్తున్నారని పరిశోధకులు తెలియజేశారు.. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా మూసీ నది ఒడ్డున నివసిస్తున్న ప్రాంతాల వైపు దృష్టి సారించలేదని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి..
ఈ పరిస్థితికి అద్దం పడుతూ ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పలు ప్రాంతాలు జల దిగ్బంధమై చాలా నష్టానికి గురయ్యాయి. హైదరాబాద్ మౌలిక సదుపాయాల కల్పన కోసం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ 5,380 కోట్ల రూపాయిలు కేటాయించగా అందులో 490 కోట్ల రూపాయిలు కేవలం డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, పునరుద్ధరణ కోసమే కేటాయించడం జరిగింది.. కాగా కరోనా కారణంగా ఈ పనులు ముందుకు సాగి ఉండకపోవచ్చని అభిప్రాయం వెల్లడవుతోంది..
అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే హైదరాబాద్ లో ఒకప్పుడు 2000 చెరువులు ఉండేవని నేడు 200 కూడా కనిపించటం లేదు. చెరువులను, బావులను పూడ్చి చేపడుతున్న నిర్మాణాలు చేపట్టడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమని చెప్పక తప్పదు.. దీనికితోడు 80 అడుగుల కాల్వలు, 8 అడుగులకు చేరిపొతే వ్యర్ధాలు బయటకు ఎలా వెళతాయి అన్నది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న.. హైదరాబాద్ నగరానికి 5,000 కిలోమీటర్ల నాలాలు, కాలువలు అవసరమైతే, ప్రస్తుతం కేవలం 1500 కిలోమీటర్ల మేర మాత్రమే నాలాలు ఉన్నాయని నిపుణుల అంచనా.. 4,00,000 డ్రైనేజీ గుంతలు ఉండాల్సిన చోట కేవలం 2,00,000 డ్రైనేజీ గుంతలు మాత్రమే ఉన్నాయి అన్నది కూడా వారి అంచనా..
ఇక ఎవరైనా ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు దానికి తగిన చట్టపరమైన ఆమోదాలు ఉన్నాయా లేదా? వర్షపు నీరు నిల్వ చేసేందుకు తగిన ఇంకుడు గుంతలు ఉన్నాయా లేదా లాంటి అంశాలన్నీ పరిశీలనలోకి తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.. అదే విధంగా గృహ నిర్మాణాలకు ఆమోదం తెలిపే ముందు అధికారులు ముందు చూపుతో వ్యవహరించాలని.. అలాగే ప్రజలు కూడా అత్యాశకు పోకుండా ఆ ప్రాంత భౌగోళిక స్వరూపం అర్ధం చేసుకుని గృహ నిర్మాణం చేసుకుంటే భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనే పరిస్థితి రాకపోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు..
వాటర్ జోన్ల గురించి, గృహ నిర్మాణానికి అనువుగా ఉన్న స్థలాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభత్వంపై ఖచ్చితంగా ఉంటుంది.. అవగాహన కల్పించడానికి చాలా మంది ఉన్నారు కానీ, నిజానికి ఇప్పుడు కావల్సింది క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన వ్యక్తులు అన్నది నిర్విదాంశం.. ప్రతి ఒక్కరు వర్షపు నీరు నిల్వ ఉంచేందుకు తగిన ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించాలి. చెరువులను, బావులను పునరుద్ధరించాలి. ఇటీవల హైటెక్ సిటీలో పునరుద్ధరించిన ఒక బావి ఈ వర్షాల సమయంలో 4 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయగలిగింది ఎంతమందికి తెలుసు..? గతంలో ఆ బావి ఒక డంపింగ్ యార్డ్ గా ఉండేది. వర్షపు నీరు నిల్వ ఉండే కేంద్రాలు పెరగడం ద్వారా ఇలాంటి వరదలను తప్పకుండా నివారించవచ్చు..
పబ్లిక్ ప్రైవేట్ సహకారంతో భూగర్భ జలాల సంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలను తక్షణమే మొదలుపెట్టాలని మేధావులు సూచిస్తున్నారు.. హైడ్రా ఈ దిశగా ఆలోచించాల్సి వుంది.. లేకపోతే ఇలాంటి వైపరీత్యాలు ఎదుర్కోక తప్పదు.. ఇది అందరూ గ్రహించాలి.. ముఖ్యంగా చెరువులను వ్యర్ధాలతో నింపడం ఆపాలి.. ఇందుకోసం ప్రజలు, ప్రభుత్వాలు సంసిద్ధం కావాలి..
ఒక్క విషయం మాతం వాస్తవం "భూ వినియోగ పద్దతులలో మార్పులు వస్తేనే కానీ, పరిస్థితులు మారవు"..
"ప్లకార్డులు పట్టుకుని వాతావరణ మార్పులు కావాలంటే రావు.. క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరూ పని పనిచేయాలి.. ఏ ఒక్కరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడటానికి వీలు లేదు.. నీటి సంరక్షణ పట్ల సానుకూలంగా లేకపోయినా కనీసం తటస్థంగానైనా ఉండవలసిన అవసరం ఉంది. చేయి చేయి కలిస్తే చేయలేని మార్పు ఏమి ఉండదు" అని " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " పిలుపునిస్తోంది..