పోలీసు అన్నల్లో మార్పు వస్తుందా..?
ప్రజలకు భరోసా ఇచ్చే పోలీసు వ్యవస్థ భయాందోళనలను కల్గిస్తోంది..!
- కొంతమంది పోలీసుల ప్రవర్తన అందరికీ మచ్చ తెస్తోంది..
- పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే సామాన్యులకు ధైర్యం సరిపోవడం లేదు..
- రక్షణ కోసం వెళ్తే దౌర్జన్యం.. దుర్మార్గం ఎదురవుతోంది..!
- పోలీస్ అనే పదం కనిపిస్తే చాలు ఒళ్ళంతా చమటలు పడుతుంటాయి..
- పోలీసులు కఠిన శిక్షణ తీసుకునేది సామాన్యులను భయపెట్టడానికా..?
- ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి..
- డబ్బు, పలుకుబడి, రాజకీయాలు ఈ మూడే పోలీసు వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాయి..
- ఫ్రెండ్లీ పోలీస్ అనే మాట అచ్చులో తప్ప వాస్తవంలో కనిపించడం లేదు..
- ఈ పరిస్థితులు వాంఛనీయం కాదు.. మార్పు అనేది అసాధ్యం కూడా కాదు..
- పోలీస్ వ్యవస్థ సంపూర్ణంగా ప్రక్షాళన కావాలన్నదే " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " ఆరాటం, పోరాటం..
పోలీస్ అంటే ఎంతో పవర్ ఫుల్.. పోలీస్ వ్యవస్థ ఈ సమాజంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనది.. దేశ సరిహద్దుల్లో సైనిక శక్తి కంటికి నిద్ర లేకుండా దేశ జనాభాను కాపాడుతోందో.. అంతే బాధ్యతగా దేశంలోని అన్ని ప్రాంతాలను సురక్షితంగా కాపాడే బాధ్యత పోలీస్ స్వీకరించింది.. ఏ సమయంలో ఎలాంటి ఆపద వచ్చినా క్షణాల్లో పోలీసులు వచ్చి కాపాడతారు అన్న ధైర్యంతోనే హాయిగా జీవిస్తున్నాం.. కంటినిండా నిద్రబోతున్నాం.. దొంగలు, రౌడీలు, ఇతర ముష్కరులు ఎంతమంది ఇబ్బందులు కలిగించినా పోలీసులు చూసుకుంటారు అనే నిశ్చింతతో జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం.. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి.. విధులు నిర్వహించి ఎంతో మందిని కాపాడిన గొప్ప చరిత్ర పోలీసులకు ఉంది.. కరడుగట్టిన దోషులను సైతం కట్టింది చేసిన విజయగాధలు ఎన్నెన్నో పోలీసు వ్యవస్థలో మనం చూస్తూ ఉంటాం.. అలాంటి సంఘటనలు, అలాంటి వార్తలు చదివినప్పుడు పోలీసులంటే ఎనలేని గౌరవం కలుగుతుంది.. కానీ ఈ పోలీసు వ్యవస్థలో కొంతమంది చేస్తున్న పనుల వలన యావత్ పోలీసు వ్యవస్థకే మలినం అంటుతోంది.. జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో పోలీసు వ్యవస్థ అంటేనే అసహ్యం కలుగుతోంది.. డబ్బుకు, రాజకీయ పలుకుబడికి, అధికారానికి అమ్ముడుపోయి తమ కర్తవ్యాన్ని తాకట్టుపెడుతున్నారు కొందరు పోలీసులు.. మనకు న్యాయం జరుగుతుందని పోలీసుల దగ్గరికి వెళ్తాము.. కానీ పోలీసులే అన్యాయం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి.. ఎవరు ధైర్యం ఇవ్వాలి.. అందుకే పోలీసు వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసే దిశగా ఒక కార్యాచరణ రూపొందింది.. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్ :
రాష్ట్రంలో పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు ఎట్టకేలకు పోలీసు కంప్లయింట్ అథారిటీ ఏర్పాటయింది. ఇది ఎంతో శుభదాయకం.. బీఆర్.కె. భవన్ లో ఇంతకు ముందు కాళేశ్వరం కమిటీ కార్యాలయం వున్న ఛాంబర్ లో ఈ అథారిటీ ఏర్పాటైంది.. ఈ పోలీసు కంప్లయింట్ అథారిటీకి చైర్మన్ గా విశ్రాంత జడ్జి జస్టిస్ శివ శంకర్ రావు నియమితులైయ్యారు.. కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఇంతవరకు బాగానే ఉంది.. పోలీసులపై ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయింది.. పోయిన ఆ నమ్మకాన్ని ఈ సంస్థ కొంచం కొంచంగా చిగురింపజేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. కానీ ఇప్పుడు ఏర్పాటైన సంస్థ ఎలాంటి ప్రలోభాలకు, రాజకీయ వత్తిడులకు లొంగకుండా.. తర తమ బేధాలు లేకుండా, ఆశ్రిత పక్షపాతం అనేదానికి చోటులేకుండా.. నిష్పక్షపాతంగా.. నిజాయితీగా పని చేస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుందనే భావం అందరిలో వ్యక్తం అవుతోంది.. కనీసం ఇప్పటి నుంచైనా సామాన్య ప్రజానీకం పోలీస్ అంటే భయం లేకుండా జీవించే అవకాశం ఉంటుంది.. అలాగే అవినీతికి పాల్పడటానికి పోలీసు వ్యవస్థ కూడా వెనుకంజ వేస్తుంది.. ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ప్రజల తరఫున పనిచేస్తుంది.. కొత్తగా ఏర్పాటైన పోలీస్ కంప్లయింట్ అథారిటీ అలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తుందని.. ఆశిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ " సంస్థ.. అదే విధంగా అథారిటీ చైర్మన్ విశ్రాంత జడ్జి జస్టిస్ శివ శంకర్ రావు కు అభినందనలు తెలుపుతోంది.. తమ సంస్థ కూడా అథారిటీకి సహరిస్తుందని తెలియజేస్తోంది..