ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి
రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జూలై 19 : స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకుని, ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు ఎం.రమేష్, సంకెపల్లి సుధీర్ రెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు టి.వినయ్ కృష్ణారెడ్డి, ఆశిష్ సంగ్వాన్ లు ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ కు వివరించారు. మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, తడి, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా విడుదల అయిన నిధులు, వాటి వెచ్చింపు వివరాలను గణాంకాల ద్వారా వెల్లడించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వాములు చేస్తూ, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవు పలికారు. ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకుని, పల్లె, పట్టణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాస్త్రీయ దృక్పథంతో పని చేయాలని అన్నారు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణం జరిగి, అన్ని వర్గాల వారు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే ఆర్థిక సంఘం ధ్యేయమని చైర్మన్ స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు సమసిపోయి, మానవ సంపద, వారి శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడేలా కృషి జరగాలన్నారు. ఈ దిశగా ప్రజలకు, ప్రభుత్వానికి కమిషన్ వారధిగా నిలుస్తూ సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఫైనాన్స్ కమిషన్ సూచనలు చేస్తుందని తెలిపారు.
అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో ప్రతి నివాస గృహానికి రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా, పారిశుధ్య నిర్వహణ పక్కాగా కొనసాగేలా స్థానిక సంస్థలు నిశిత పర్యవేక్షణ చేయాలన్నారు. కొత్త గ్రామ పంచాయతీలుగా మారిన తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీధి దీపాలకు సోలార్ విద్యుత్ ను వినియోగిస్తే కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని అన్నారు. ప్రయోగాత్మకంగా చిన్న గ్రామ పంచాయతీలలో సోలార్ విద్యుత్ విధానాన్ని అమలు చేస్తూ, క్రమంగా అన్ని స్థానిక సంస్థలకు విస్తరిస్తూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను ఆదర్శంగా నిలపాలని చైర్మన్ సూచించారు.
అదేవిధంగా నిధుల కోసం పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఆధారపడకుండా ఆదాయం సమకూర్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని తెలికారు. పన్ను వసూళ్లు, ప్రకటనలపై వచ్చే రాబడి, వృత్తి పన్ను, వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి నిర్ణీత రుసుము వసూలు చేస్తూ స్ధానిక సంస్థలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా కృషి చేయాలని అన్నారు. స్థానిక సంస్థలలో ఆదాయం వనరులు పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై అధికారుల నుండి సలహాలు స్వీకరించారు. వీటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వెల్లడించారు. సమీక్షా సమావేశంలో. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, చందర్ నాయక్, నిజామాబాద్ ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ లు, జెడ్పీ సీఈఓలు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, ఉమ్మడి జిల్లా సమీక్షకు హాజరైన రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు టి.వినయ్ కృష్ణారెడ్డి, ఆశిష్ సంగ్వాన్, నిజామాబాద్ సీ.పీ సాయి చైతన్య తదితరులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.