497 కోట్లతో పాలేరు నియోజకవర్గ పరిధిలో విద్యా శాఖ ఇన్ ఫ్రా అభివృద్ధికి చర్యలు...
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం ప్రతినిది :
సైకిళ్ల పంపిణీతో ఆడపిల్లల డ్రాప్ ఔట్ తగ్గాలి
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా ఉపాధ్యాయులు కృషి
తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో పర్యటించి పిండిప్రోలు, బోదులబండ జెడ్పీ.హెచ్.ఎస్. పాఠశాలల విద్యార్థినులకు పి.ఎస్.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యం లో సైకిల్ లను అందజేసిన మంత్రి పొంగులేటి
497 కోట్లతో పాలేరు నియోజకవర్గ పరిధిలో విద్యా శాఖ ఇన్ ఫ్రా అభివృద్ధికి చర్యలు చేపట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.మంత్రి గురువారం తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో పర్యటించి పిండిప్రోలు, బోదులబండ జెడ్పీ.హెచ్.ఎస్. పాఠశాల విద్యార్థినులకు పి.ఎస్.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిళ్లను పంపిణీ చేసారు. పిండిప్రోలు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో పాల్గొన్నారు.
గడిచిన 19 నెలల కాలంలో పాలేరు నియోజకవర్గంలో 497 కోట్ల రూపాయలు విద్యా రంగంలో ఇన్ ఫ్రా అభివృద్ధి కోసం మంజూరు చేయడం జరిగిందని అన్నారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం, తిరుమలాయపాలెంలో ఐటిఐ కేంద్రం, హస్టల్, కూసుమంచి జూనియర్ కళాశాల మంజూరు చేసామని, పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి తెలిపారు.
పేద విద్యార్థులకు మంచి ఆహారం అందించాలని గురుకులాల్లో చదివే పిల్లలకు 40 శాతం డైట్, 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ ఔట్ లేకుండా చూడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు కృషి చేయాలని మంత్రి కోరారు.
తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించి, వారి ఆశలు నెరవేర్చేలా పిల్లలు బాగా చదువుకోవాలని, ఉజ్వల భవిష్యత్తు విద్యార్థులకు ఉండాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఆడపిల్లలు పాఠశాలలు దూరంగా ఉండటం వల్ల చదువు మానకూడదు అనే మంచి ఉద్దేశంతో పి.ఎస్.ఆర్. ట్రస్టు ద్వారా మంత్రివర్యులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత తరగతులు చదివే బాలికలకు సైకిల్ పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
8వ తరగతి నుంచి డ్రాప్ ఔట్స్ పెరుగుతాయని శాస్త్రీయంగా తెలిసిందని, ప్రయాణ భారం దృష్ట్యా బాలికలు చదువుకు దూరం కావద్దని భావించిన మంత్రి 8వ తరగతి చదివే బాలికలకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని, సైకిళ్లను బాలికలు సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
పాఠశాలల్లో 14 మంది ఉపాధ్యాయులు ఉన్నారని, ఇక్కడ విద్యార్థుల సంఖ్యను 250 కు పెంచేలా పని చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ప్రారంభించిన మొదటి రోజే విద్యార్థులకు ఏకరూప దస్తులు, వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేశామని అన్నారు. విద్యార్థులకు రెండవ జత ఏక రూప దుస్తులు పంపిణీ పెండింగ్ ఉంటే వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ వాడటం ద్వారా విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు అందించాలని అన్నారు.
పిండిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిచెన్ షెడ్ ను మంత్రి పరిశీలించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం నాణ్యతతో అందించాలన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల పట్ల ప్రోత్సాహం ఇవ్వాలన్నారు.
నేలకొండపల్లి మండలానికి చెందిన 25 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు బోదులబండ లో జరిగిన కార్యక్రమంలో చెక్కులను అందజేశారు. జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంత్రి మొక్క నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారిణి నాగ పద్మజ, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, డిసిసిబి డైరక్టర్ బొర్రా రాజశేఖర్, తహశీల్దార్లు విల్సన్, వెంకటేశ్వర్లు, ఎంపిడివో లు సిలార్ సాహెబ్, ఎర్రయ్య, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి, నిర్మల, జిసిడీఓ తులసి, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.