ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణలో నిబంధనలు తప్పకుండా పాటించాలి ....
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం ప్రతినిది :
ప్రతి ఆసుపత్రి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ప్రైవేట్ ఆసుపత్రులలో ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలి
ఆరోగ్య శ్రీ, సీఎం రిలిఫ్ ఫండ్ లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
ఆసుపత్రులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
హెచ్.ఎం.ఎస్, వైద్య ఖర్చుల నియంత్రణ, పి.సి.పి.ఎన్.డి.టి, ఇతర యాక్ట్ లపై ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణలో నిబంధనలు తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
మన వాహనాలకు ఏ విధంగా రిజిస్ట్రేషన్, లైసెన్స్ తీసుకుంటామో, అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తప్పనిసరిగా వంద శాతం క్లినికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ క్రింద రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు పాటించాల్సిన నిబంధనలు ప్రభుత్వం నిర్ణయిస్తుందని అన్నారు. ప్రతి ఆసుపత్రిలో వివిధ వైద్య సేవలకు వసూలు చేసే ఫీజుల వివరాలు, ధరల పట్టిక ప్రదర్శించాలని అన్నారు. నిరుపేదలకు ఎంపానెల్మెంట్ ఆసుపత్రులలో 10 లక్షల రూపాయల చికిత్స అందించాలని ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తుందని, ఈ పథకం పట్ల అక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఒకే చికిత్సకు సీఎం రిలిఫ్ ఫండ్, ఆరోగ్య శ్రీ రెండు చోట్ల క్లెయిమ్స్ చేస్తున్నారని, ఈ పద్దతి మారాలని అన్నారు. ఐ.వి.ఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ నిర్వహణలో నిబంధనలు పాటించాలని అన్నారు. హైదరాబాద్ కేసులో టెస్ట్ ట్యూబ్ బేబి నుంచి మానవ రవాణా వరకు తప్పులు జరిగాయని, అటువంటివి నివారించేందుకు మనం నిబంధనలు పాటించాలని అన్నారు. ఫర్టిలిటి సెంటర్, ఐ.వి.ఎఫ్. క్లినిక్, జెనెటిక్ కౌన్సిలింగ్, నర్సింగ్ హోమ్, డయాగ్నొస్టిక్, స్పీచ్ థెరపీ వంటి అనేక రకాల ఆసుపత్రులు వస్తున్నాయని, వీరందరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. స్పీచ్ థెరపీ పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అక్కడ క్వాలిఫైడ్ వైద్యులు ఉన్నారా వంటి అంశాలు పరిశీలన చాలా అవసరమని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా పార్కింగ్ సౌకర్యం, అగ్ని ప్రమాదాల నివారణకు వాహనాలు వచ్చేలా ఫైర్ క్లియరెన్స్ ఉండాలని అన్నారు. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ లో అగ్ని ప్రమాదం కారణంగా ఒక ఇంట్లో మూడు తరాలకు చెందిన ప్రజలు మరణించారని, ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఆసుపత్రులు తప్పనిసరిగా పాటించాలని, ఇందులో ఎటువంటి సడలింపు ఇవ్వడం కుదరదని కలెక్టర్ స్పష్టం చేశారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు, టీబీ నియంత్రణలో ప్రైవేటు ఆసుపత్రులు తమ సహకారం అందిస్తున్నారని అన్నారు. ఆరోగ్యకరమైన ఖమ్మం జిల్లాను తయారు చేయడంలో ప్రైవేట్ ఆసుపత్రులు తమ సహకారం అందించాలని అన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, పి.సి.పి.ఎన్.డి.టి, ఇతర చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
ఐ.ఎం.ఏ. జిల్లా అధ్యక్షులు డాక్టర్ కంభంపాటి నారాయణ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపుపై హై కోర్టు స్టే ఇచ్చిందని, దీనిని మున్సిపాలిటీ లలో అమలు అయ్యేలా చూడాలని అన్నారు. చిన్న ఆసుపత్రులకు ఫైర్ సేఫ్టీ అంశంలో కొంత సడలింపు ఇవ్వాలని అన్నారు. అనంతరం ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహణ పట్ల ప్రైవేట్ వైద్యులు అందించిన సూచనలు, సలహాలను కలెక్టర్ తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. బి. కళావతి బాయి, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ రాజశేఖర్ గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. చందు నాయక్, డా. వెంకట రమణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ., స్టేట్ టి.ఓ.టి. లు డా. కల్పన తోరన్, ఎస్.ఎం.ఓ. డా. మురారి రాజేంద్రప్రసాద్, డాక్టర్ నారాయణ మూర్తి, ప్రభుత్వ, ప్రైవేట్ గైనకాలాజిస్టులు, రేడియోలజిస్టులు, డాక్టర్లు, హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్లు, డెమో సుబ్రహ్మణ్యం, స్థాటస్టికల్ ఆఫీసర్ నవీన్ కుమార్, డిపిఎం. దుర్గ, హెల్త్ ఎడుకేటర్ అన్వర్, డిడిఎం. నాగరాజు, డిఎస్ఓ వేణు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.