పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలి.....
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం ప్రతినిది :
39 కోట్లతో సుబ్లేడు గ్రామానికి కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల శాశ్వత పరిష్కారం
తిరుమలాయపాలెం మండలంలో పర్యటించి పలు రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పొంగులేటి
పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సుబ్లేడు గ్రామానికి కనెక్టివిటీ పెంచేందుకు ప్రజా ప్రభుత్వంలో 39 కోట్లతో పలు రోడ్లు మంజూరు చేశామని అన్నారు. నేడు 12 కోట్ల రూపాయలతో కల్వర్ట్, రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. పాలేరు మరిపెడ రోడ్డుకు 16 కోట్లు, సైడ్ డ్రైయిన్లు కోటి 30 లక్షల, జడ్పిహెచ్ఎస్ హస్టల్ భవన నిర్మాణానికి రెండు కోట్ల 70 లక్షల రూపాయలు, దమ్మాయిగూడెం నుంచి కాకరవాయి రోడ్డు 2.5 కోట్ల వంటి పలు అభివృద్ధి పనులు మంజూరు చేశామని అన్నారు.
రాష్ట్రంలోనే ప్రతి మారుమూల గ్రామంలో అభివృద్ధి పనులు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన మంచి కార్యక్రమాలను బేషజాలకు పోకుండా కొనసాగిస్తున్నామని, అదనంగా మహిళలకు భారం తగ్గించేలా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.
రైతన్నలకు గతంలో 10 వేల రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తే, ప్రజా ప్రభుత్వం 12 వేలకు పెంచి వానాకాలం పంటకు 9 రోజులలో 9 వేల కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసామని అన్నారు. ఉగాది నుంచి పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, 7 లక్షల నూతన రేషన్ కార్డులు జారీ, పాత రేషన్ కార్డులలో 17 లక్షల మంది కుటుంబ సభ్యులను చేర్చడం జరిగిందని అన్నారు.
అర్హులైన పేదలందరికీ దశల భారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని అన్నారు. వసతి గృహాలలో 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచడం జరిగిందని, అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నామని అన్నారు.
భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేసే ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉండాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ 12 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను నేడు సుబ్లేడు గ్రామం లో మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు. వర్షాలు కూడా కొంత తగ్గు ముఖం పట్టినందున అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చూసి రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబ్, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, డిసిసిబి అధ్యక్షులు నరేష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శివ రామకృష్ణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.