రెవెన్యూ డిపార్ట్మెంట్లో రాజ్యమేలుతున్న అవినీతి..
స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ :
- ఏ ఫైల్ కదలాలన్నా చేతులు తడపాల్సిందే..
- రైతుల రెక్కలకష్టం లంచాలకు బలి..
- కీలకమైన రెవెన్యూ శాఖకు గ్రహణం..
- లంచాల వ్యవహారం బహిరంగ రహస్యం..
- ప్రభుత్వాలు కూడా కట్టడిచేయలేని దుస్థితి..
- భూయజమానులను సైతం మార్చేస్తున్న అధికారులు..
- అప్పట్లో ధరణి.. ఇప్పుడు బిల్డ్ నౌ దొందూ దొందే..
- పారదర్శకత కరువైన ప్రతిష్టాత్మక సైట్లు..
- టెక్నాలజీ మాటున దాగివున్న దగాకోరు తనం..
- ఈ వ్యవస్థ మారాలని డిమాండ్ చేస్తున్న " ఫోరం ఫేర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
రాష్ట్ర ప్రజలకు నేరుగా సంబంధించిన కీలకమైన శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్. భూముల రికార్డులు, పాస్బుక్స్, వారసత్వ హక్కులు, రిజిస్ట్రేషన్లు, పన్నులు, సర్టిఫికెట్లు వంటి అనేక సేవలు ఈ శాఖ పరిధిలో ఉంటాయి. కానీ సంవత్సరాలుగా ఈ శాఖలో అవినీతి, లంచాల వ్యాపారం, అధికారుల నిర్లక్ష్యం బహిరంగ రహస్యం అయిపోయింది.
భూస్వామ్య రికార్డులు మార్పులు ప్రధానమైనది.. రికార్డులు తారుమారు చేసి అక్రమంగా భూములు బదిలీ చేయడం. లంచం లేకుండా ఏ పనీ జరగడం లేదు.. సర్టిఫికెట్ జారీ, భూమి పాస్బుక్, మ్యూటేషన్ వంటి పనుల కోసం ప్రజలపై లంచం ఒత్తిడి పెరిగిపోతోంది.. ఇక అక్రమ నిర్మాణాలకు సహకరించడం అధికారులకు అలవాటైపోయింది.. అక్రమ నిర్మాణాలు, ఎన్క్రోచ్మెంట్లకు రెవెన్యూ సిబ్బంది తమవంతు సహకారం అందిస్తున్నారు..
ఇక నకిలీ పత్రాల హడావుడి అంతా ఇంతా కాదు.. ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయడం పరిపాటి అయిపొయింది.. రైతుల పట్ల తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు రెవెన్యూ సిబ్బంది.. రైతుల భూములను పరిశీలించకుండా, కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూరేలా అక్రమ చర్యలు తీసుకుంటున్నారు..
దీంతో రైతులు, సాధారణ ప్రజలు ఎన్నో నెలల తరబడి తిరుగుతూ విసిగి పోతున్నారు. ఒక చిన్న తప్పు సరిచేయించుకోవాలన్నా వందల నుంచి వేల రూపాయల వరకు లంచం చెల్లించాల్సి వస్తోంది.. పేదవారు తమ హక్కుల కోసం చట్టపరంగా ఉన్న హక్కులను కూడా వదులుకోవాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది..
అయితే దీనికి పరిష్కార మార్గాలు లేవా అంటే ఉన్నాయి.. కానీ వీటిని అమలుపరిచే వారెవ్వరు అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది..
డిజిటల్ రికార్డులు, ఆన్లైన్ సేవలు పారదర్శకంగా నిర్వహించడం ఒకటి.. విజిలెన్స్, యాంటీ-కరప్షన్ విభాగాలు రెగ్యులర్గా తనిఖీలు చేయడం చేయాలి.. లంచం అడిగిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. గ్రామస్థాయిలో అవగాహన కల్పించడం.. హెల్ప్లైన్ల ద్వారా ప్రజలకు సహాయం చేయడం..
మొత్తం మీద రెవెన్యూ శాఖలో అవినీతి సమస్య ప్రజల దైనందిన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తోంది. “లంచం లేకుండా పని జరగదు” అన్న వాదన ఈ శాఖకు అంటుకుపోయింది. పారదర్శకత, సాంకేతికత, కఠిన చర్యలతోనే ఈ సమస్య తగ్గే అవకాశం ఉంది..
“లంచం లేకుండా పని జరగదు”.అనే భావన నుంచి ప్రజలను బయటపడవేయగలగాలి..
రెవెన్యూ కార్యాలయాల్లో రోజూ జరిగేది సేవలందజేయడమా లేక దోపిడీనా అన్న అనుమానం కలిగే స్థాయి నుంచి ప్రజల అభిప్రాయాన్ని మార్చాలి.. ప్రభుత్వాలు ఎన్ని మారినా, మంత్రులు ఎందరు మారినా, ఈ అవినీతి పాలన మాత్రం మారడం లేదు. పైకి డిజిటల్ రికార్డులు, ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినా, ఆన్లైన్లో ఫైల్ వేసిన పౌరుడు ఆఫీసు మెట్లెక్కకపోతే పని జరగదనే వాస్తవం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ పరిస్థితుల్లో పూర్తిగా దెబ్బతిన్న ప్రజల విశ్వాసం తిరిగి పునరుజ్జీవం పోసుకోవాలి.. న్యాయం కోసం పోరాడాల్సిన ప్రజలు, అధికారుల కరుణకు బానిసలైపోకుండా చూడాలి.. వ్యవస్థ పట్ల విసుగు, అసహనం పెరిగిపోకుండా చూసుకోగలగాలి.. నిజంగా ఇప్పుడు అవసరమైంది దృఢమైన రాజకీయ సంకల్పం, కఠినమైన శిక్షలు, పూర్తి స్థాయి పారదర్శకత. లంచం అడిగిన అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదు.. చట్టపరంగా శిక్షించి, ప్రజల్లో విశ్వాసం కలిగించాలి.
రెవెన్యూ శాఖలో అవినీతి ఒక శాఖ సమస్య మాత్రమే కాదు.. అది సమాజంపై నేరుగా పడే భారం కూడా.. ప్రజాస్వామ్య నిబద్ధతకు ఇది పెద్ద సవాలు.. ఈ వ్యవస్థను శుభ్రం చేయకపోతే, భూమి హక్కుల నుంచి సాధారణ పౌర సేవల వరకు ప్రతి అడుగులోనూ ప్రజలు మోసపోతూనే ఉంటారు. కనుక రెవెన్యూ శాఖ పూర్తిగా ప్రక్షాళన జరగాలని కోరుకుంటోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".