సరూర్నగర్లో అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారిణి..
- మామూళ్ల మత్తులో అక్రమ నిర్మాణాలకు కొమ్ముకాస్తున్న వైనం!
- *జీరో సెట్బ్యాక్లతో నిబంధనలకు తిలోదకాలు..
- వ్రాతపూర్వక ఫిర్యాదులపై చర్యలు శూన్యం..
- అగ్నిప్రమాదాల పొంచి ఉన్నముప్పు.. పట్టించుకోని సరూర్నగర్ ,డెప్యూటీ కమిషనర్ కార్యాలయం.
ఎల్బీనగర్:
*అనుమతి ఒకదానికి.. నిర్మాణం మరొకదానికి!
సరూర్నగర్ సర్కిల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సరూర్నగర్ చౌరస్తా, బొడ్రాయి ఎదురుగా, (చౌడి) వైపు వెళ్లే మార్గంలోని మండల విద్యాధికారి కార్యాలయం (MEO ఆఫీస్) వెనుక రోడ్డులో ఉన్న ఇంటి నంబర్: 11-5-118 గల స్థలంలో భవన నిర్మాణ నిబంధనలను నిలువునా పూడ్చిపెడుతున్నారు. సదరు ఆస్తి యజమానికి గతంలో కేవలం ఒకే అంతస్తు నివాస భవనానికి మాత్రమే అనుమతి ఉంది. అయితే, ప్రస్తుతం ఎలాంటి సవరించిన అనుమతులు లేకుండానే, ఆ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల వాణిజ్య భవనంగా మారుస్తూ కొత్త నిర్మాణాన్ని శరవేగంగా చేపడుతున్నారు.
*నిబంధనలు బలి.. ప్రాణాలకు ముప్పు!
ఈ నిర్మాణంలో కనీస నిబంధనలను గాలికొదిలేశారు. చుట్టూ వదలాల్సిన ఖాళీ స్థలాన్ని (సెట్బ్యాక్లు) అసలు వదలకుండా, ఏకంగా ప్రభుత్వ రహదారి అంచు వరకు ఆనుకుని భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలోని రహదారి చాలా ఇరుకైనది కావడం, దానికి తోడు ఈ భవనానికి ఖాళీ స్థలం లేకపోవడంతో భవిష్యత్తులో తీవ్రమైన అగ్ని ప్రమాద ముప్పు పొంచి ఉంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, అగ్నిమాపక యంత్రాలు లేదా అత్యవసర వాహనాలు ఆ ప్రాంతానికి చేరుకోవడం పూర్తిగా అసాధ్యం. కేవలం వాణిజ్య లాభాల కోసమే నివాస అనుమతులను దుర్వినియోగం చేస్తూ స్థానిక ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో తీవ్రమైన రద్దీ సమస్యలు, ప్రజలకు అసౌకర్యం కలగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ అక్రమ నిర్మాణంపై స్థానికులు నిర్మాణ దశలోనే డెప్యూటీ కమిషనర్ కార్యాలయం (సర్కిల్ నంబర్ 11) కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీని వెనుక అసలు కారణం టౌన్ ప్లానింగ్ అధికారిణి అర్చన అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిర్యాదు అందినప్పటికీ, సదరు అధికారిణి క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించకుండా అక్రమ నిర్మాణదారుడి నుంచి భారీగా ముడుపులు తీసుకుని, ఈ అక్రమ నిర్మాణానికి పూర్తి స్థాయిలో కొమ్ముకాస్తున్నట్లు స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
నిర్మాణ దశలోనే ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా, లంచాల ఆశతో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారిణి అర్చనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే ఈ అక్రమ వాణిజ్య నిర్మాణాన్ని నిలిపివేసి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై, వారికి సహకరించిన సదరు అధికారిణిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

