బడి పిల్లల ప్రాణాలతో ‘ఆర్టీఏ’ చెలగాటం..!
- లంచాల’ మత్తులో రవాణా శాఖ.. దళారుల చేతుల్లో చిన్నారుల భద్రత
- *ఒక్క నిమిషంలో ‘ఫిట్నెస్’ మాయాజాలం.. కంప్యూటర్ లాగ్లలో దొరికిన ఏసీబీ ఆధారాలు
- *వాహనం రాదు.. బ్రేకులు చూడరు.. ‘ఫైళ్ల కింద నోట్లు’ పెడితే చాలు ‘గ్రీన్ సిగ్నల్’
- *వేగ నియంత్రణలు శూన్యం.. నకిలీ ఇన్సూరెన్స్ల దందా.. బ్రోకర్ల వాట్సాప్ చాట్లలో రేట్ల గుట్టు రట్టు!
రాష్ట్రంలో రవాణా శాఖ కార్యాలయాలు దళారుల చేతుల్లో చిక్కుకుని, అవినీతి కూపాలుగా మారాయనే చేదు నిజాన్ని ఏసీబీ తనిఖీలు బట్టబయలు చేశాయి. విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న వేళ, విద్యార్థుల భద్రతను గాలికొదిలేసి కేవలం ఒక్క నిమిషంలోనే స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తూ అధికారులు లంచాల మత్తులో జోగుతున్నారు. నకిలీ ఇన్సూరెన్సులు, పనిచేయని స్పీడ్ గవర్నర్లను చూసీచూడనట్లు వదిలేస్తూ 'మామూళ్ల' కోసం చిన్నారుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఆటోలలో పరిమితికి మించి పిల్లలను కుక్కుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా 'తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం.ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించి, ఈ మాఫియాపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే అమాయక పిల్లల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. దీనిపై 'ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ హ్యూమన్ రైట్స్, అందిస్తున్న ప్రత్యేక పరిశోధనాత్మక కథనం..jpeg)
హైదరాబాద్:
రాష్ట్రంలో రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాలు సామాన్య పౌరులకు సేవలు అందించే ప్రభుత్వ కేంద్రాలుగా కాకుండా, దళారీలు శాసించే అలిఖిత ‘సమాంతర అవినీతి సామ్రాజ్యాలు’గా మారిపోయాయి. అంతా ఆన్లైన్ చేశామని, అవినీతికి తావులేదని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ‘కాసులు’ కురిపిస్తేనే ఫైళ్లు కదులుతున్నాయని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జరిపిన ఆకస్మిక తనిఖీల్లో నగ్నసత్యాలు బహిర్గతమయ్యాయి. ఎండాకాలం సెలవులు ముగిసి, పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న వేళ.. లక్షలాది మంది అమాయక చిన్నారుల ప్రాణాలను పణంగా పెడుతూ సాగుతున్న ఈ వ్యవస్థీకృత దోపిడీపై ‘భారత శక్తి’ ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశోధనాత్మక కథనం.
విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రతీ స్కూల్ బస్సును ఆర్టీఏ అధికారులు 32 రకాల కఠినమైన భద్రతా ప్రమాణాల ఆధారంగా తనిఖీ చేయాలి. నిబంధనల ప్రకారం ఒక వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి కనీసం 15 నుండి 20 నిమిషాల సమయం పడుతుంది..jpeg)
ఏసీబీ అధికారులు ఆర్టీఏ కంప్యూటర్ సిస్టమ్ లాగ్స్ పరిశీలించగా మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. కేవలం *ఒక్క నిమిషం (60 సెకన్లు)* వ్యవధిలోనే స్కూలు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు అప్రూవ్ అయిపోయాయి! అంటే కనీసం వాహనాన్ని కంటితో చూడకుండానే, ఆఫీస్ గ్రౌండ్లోకి బస్సు రాకుండానే.. టేబుల్ పైనే ఫైళ్లు క్లియర్ అయిపోయాయనే దానికి ఇవే డిజిటల్ సాక్ష్యాలు.
*వాట్సాప్ చాట్లలో ‘లంచాల’ మెనూ కార్డు!
అధికారుల ప్రైవేట్ సహాయకులు (కంప్యూటర్ ఆపరేటర్లు), దళారుల ఫోన్లను ఏసీబీ సీజ్ చేయగా అసలు గుట్టు రట్టయింది. అందులో బస్సుల నంబర్లు, వాటి పక్కన రేట్లు (ఉదాహరణకు: *స్కూల్ బస్సు ఫిట్నెస్ - రూ. 5,000) అని స్పష్టంగా రాసి ఉన్న చాట్ హిస్టరీ లభ్యమైంది. దళారులు సమర్పించే ఫైలులో ‘మామూళ్ల’ సొమ్ము ఉంటే చాలు.. క్షణాల్లో ‘కండిషన్ పక్కా’ అంటూ సర్టిఫికెట్ చేతికి వచ్చేస్తోంది.
*సామాన్యుడికి ‘ఫీల్డ్ టెస్ట్’.. బ్రోకర్లకు ‘రాయల్ ఎంట్రీ’
ఒక సామాన్య పౌరుడు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తే, చిన్న తప్పు దొర్లినా ‘ఫెయిల్’ ముద్ర వేసే అధికారులు.. అదే దళారీ (ఏజెంట్) ద్వారా వెళ్తే కనీసం డ్రైవింగ్ రాకపోయినా ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చేస్తున్నారు. వ్యవస్థలోని లోపాలను వాడుకుంటూ, సామాన్యుల దరఖాస్తులను కావాలనే నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారు. అధికారిక ఫీజు కంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఏజెంట్లు వసూలు చేస్తూ, అందులో సింహభాగాన్ని ఆర్టీఏ అధికారులకు ‘నెలవారీ మామూళ్లు’గా చేరవేస్తున్నారు.
‘డీడీ’ల స్థానంలో నగదు కట్టలు.. ప్రైవేట్ అడ్డాల్లో ప్రభుత్వ ఫైళ్లు!
వాహన రిజిస్ట్రేషన్, కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ ప్రక్రియలో ప్రభుత్వానికి కేవలం బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) లేదా ఆన్లైన్ పేమెంట్ రసీదులను మాత్రమే ఫైళ్లకు జతచేయాలి. కానీ, ఏసీబీ తనిఖీల్లో విరుద్ధమైన నిజాలు బయటపడ్డాయి:
*ఫైళ్లలోనే లంచం సొమ్ము: డీడీలు ఉండాల్సిన చోట నేరుగా 500 నోట్ల కట్టలను దాచి ఉంచుతున్నారు. ఫైలును పరిశీలించే అధికారికి ఆ నగదు నేరుగా అందుతుంది.
కార్యాలయాలు బయట ‘సమాంతర’ పాలన: ప్రభుత్వ ఆఫీసుల్లో భద్రంగా ఉండాల్సిన అసలు దరఖాస్తు ఫైళ్లు, ఆర్టీఏ కార్యాలయాల బయట ఉండే బ్రోకర్ల ప్రైవేట్ దుకాణాల్లో, డబ్బాల్లో కుప్పలుగా పేరుకుపోవడం ఈ మాఫియా బలానికి నిదర్శనం.
*ప్రమాదాల ముప్పు: నకిలీ పత్రాల మాయాజాలం!
ఈ అవినీతి కేవలం డబ్బు వసూళ్లతోనే ఆగడం లేదు.. నేరుగా రోడ్డు భద్రతకు, చిన్నారుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది.
బోగస్ ఇన్సూరెన్స్ & పొల్యూషన్:* ఒకవేళ ప్రమాదం జరిగితే థర్డ్ పార్టీకి రక్షణ కల్పించే ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను కొందరు ఏజెంట్లు కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా ‘బోగస్’గా సృష్టిస్తున్నారు. కాలం చెల్లిన నకిలీ పత్రాలను అధికారులు ఆన్లైన్ డేటాబేస్తో కనీసం వెరిఫై చేయకుండానే ఓకే చేస్తున్నారు.
స్పీడ్ గవర్నర్ల ‘టాంపరింగ్’: స్కూల్ బస్సులు గరిష్టంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగం దాటకుండా వేగ నియంత్రణ పరికరాలు (స్పీడ్ గవర్నర్స్) ఉండాలి. కానీ, ఫిట్నెస్ టెస్ట్ రోజున పాత బస్సులకు తాత్కాలికంగా వేరే బస్సుల పరికరాలను తగిలించి పాస్ చేయిస్తున్నారు. ఆఫీస్ బయటకు రాగానే వాటిని తొలగించి యథేచ్ఛగా నడుపుతున్నారు.
వేగ నియంత్రణ పరికరం
ఎక్కువ బస్సుల్లో ఇది పనిచేయదు లేదా పూర్తిగా తొలగిస్తారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకుండానే ఆమోదం తెలపడం.
*అత్యవసర నిష్క్రమణ ద్వారం:
సీట్లు అడ్డుగా ఉండటం, లాకులు పూర్తిగా తుప్పుపట్టడం. భౌతిక తనిఖీ లేకుండానే టేబుల్ పైనే ఫైల్ క్లియరెన్స్.
*ప్రథమ చికిత్స & అగ్నిమాపక రక్షణ
గడువు తీరిన మందులు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు దర్శనమిస్తాయి. లంచం తీసుకుని నివేదికలో 'అన్నీ బాగున్నాయి' అని రాయడం.
డ్రైవర్ అనుభవం*
కనీసం 5 ఏళ్ల భారీ వాహన అనుభవం లేని వారే ఎక్కువగా ఉంటున్నారు. బ్రోకర్ల ద్వారా వెనకటి తేదీల లైసెన్స్ వివరాలను ఆమోదించడం.
*ఆటోలు, వ్యాన్లలో ‘మంద’ల్లా పిల్లలు.. నెలవారీ మామూళ్ల మత్తు!
పెద్ద స్కూల్ బస్సుల పరిస్థితి ఇలా ఉంటే.. మధ్యతరగతి, పేద పిల్లలను బడికి తీసుకెళ్లే ప్రైవేట్ అటోలు, సెవెన్ సీటర్ వ్యాన్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పరిమితికి మించి 15 నుండి 20 మంది పిల్లలను గొర్రెల మందలా ఆటోల్లో కుక్కుతున్నా ఆర్టీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు కన్నెత్తి చూడటం లేదు. దీనికి కారణం.. ఆటో, వ్యాన్ అసోసియేషన్ల ప్రతినిధులు నెలవారీ ‘మామూళ్లు’ ఏజెంట్ల ద్వారా ఆర్టీఏ అధికారులకు ముట్టజెబుతుండటమేనని ఏసీబీ దాడుల్లో తేలింది.
ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ, విజ్ఞప్తి: డిజిటల్ నిఘా పెట్టాల్సిందే!
స్కూలు బస్సుల ఫిట్నెస్ అనేది కేవలం ఒక ప్రభుత్వ నిబంధన కాదు.. అది వేలాది మంది అమాయక పిల్లల ప్రాణాలకు రక్షణ కవచం. ఆర్టీఏలో ఏసీబీ దాడులు కేవలం లంచం తీసుకునే అధికారులను పట్టుకోవడానికే పరిమితం కాకూడదు. విద్యాసంవత్సరం మొదలయ్యే ఈ తరుణంలో ప్రతీ స్కూల్ వాహనం యొక్క ఫిట్నెస్ ప్రక్రియను పూర్తిగా ‘లైవ్ వీడియో రికార్డింగ్’ చేయాలి లేదా థర్డ్ పార్టీ యాంత్రిక తనిఖీ కేంద్రాలకు అప్పగించాలి. అప్పుడే బ్రోకర్ల ‘గ్రీన్ సిగ్నల్’ సంస్కృతికి బ్రేక్ పడుతుంది, మన పిల్లల ప్రయాణం సురక్షితంగా సాగుతుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి!
