ఫీజు రీఎంబర్స్ మెంట్ లేక విద్యార్థుల అరిగోస..
సర్టిఫికెట్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్న కళాశాలలు..
- పై చదువులకు వెళ్లలేక, ఉద్యోగాలకు అటెండ్ కాలేక..
- చెల్లించడానికి ఆర్ధిక స్థోమత లేక అల్లాడుతున్న స్టూడెంట్స్..
- ఫీజ్ రీ యంబర్స్ మెంట్ రాకపోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించని వైనం..
- దాదాపు రూ. 7,500 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం..
- చెల్లించాల్సిన బకాయిల్లో సగానికిపైగా ఇంజినీరింగ్ కళాశాలలకే..
- వెంటనే ఫీజ్ రీ యంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న
కార్పొరేట్ విద్యా నియంత్రణ జే.ఏ.సీ.. - అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం అంటూ ప్రభుత్వానికి హెచ్చరిక..
ఫీజ్ రీ యంబర్స్ మెంట్ పుణ్యమా అని సామాన్య విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదివే అవకాశం కల్గింది.. కొంత కాలం ఈ ప్రక్రియ బాగానే కొనసాగింది.. కానీ రాను రాను ప్రభుత్వాలు కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజ్ రీ యంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించకుండా నిలిపివేసింది.. దీంతో ఆర్ధికంగా వెనుకబడ్డ విద్యార్థులు ఇరకాటంలో పడ్డారు.. కోర్సు పూర్తయినా కూడా కళాశాలల యాజమాన్యం ఫీజు బకాయిలు ఉండటంతో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు.. దీంతో విద్యార్థులు పైచదువులకు వెళ్లలేక, ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కాలేక నా నా యాతన పడుతున్నారు.. అదేమని అడిగితే ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించడం లేదు.. మీకు అంత అత్యవసరంగా సర్టిఫికెట్స్ కావాలంటే డబ్బులు కట్టి తీసుకువెళ్ళండి అని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.. కొంత ఆర్ధికంగా వెసులుబాటు ఉన్న వారు ఫీజులు చెల్లించి సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు.. ఇక కొంతమంది అప్పో సొప్పో చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు.. కానీ ఇటు ఆర్ధిక పరిస్థితి బాగా లేక, అప్పులు పుట్టే అవకాశం లేక ఎంతో మంది పేద విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.. ఇదే విషయమై కళాశాలల యాజమాన్యాలను ప్రశ్నిస్తే.. ఫీజు బకాయిలు ప్రభుత్వం నుండి అందకపోవడంతో.. తాము ఆర్ధికంగా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి అవుతున్నామని.. కనీసం మా దగ్గర పనిచేసే ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేకపోతున్నామని వారు వాపోతున్నారు.. తప్పని సరి పరిస్థితుల్లో విద్యార్థులను డిమాండ్ చేయాల్సి వస్తోందని వారు అంటున్నారు..
హైదరాబాద్, ఆగష్టు 12 ( భారత శక్తి ) :
ప్రస్తుత పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఇంజినీరింగ్ కళాశాలలు కోర్టుకు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.. తెలంగాణ కు చెందిన ఓ ప్రముఖ కళాశాల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది.. కాగా ఆ కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది.. దీంతో మరికొన్ని కళాశాలలు అదే దారిలో నడిచేందుకు సమాయత్తమవుతున్నాయి. దాదాపు మూడేళ్ల బకాయిలు పెండింగ్లో ఉండటంతో ఇప్పటివరకు ఏదోక విధంగా నెట్టుకొచ్చిన ప్రముఖ కళాశాలలు సైతం సిబ్బందికి వేతనాలు చెల్లించలేక కోత పెడుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి 2022-23 నుంచి 2024-25.. అంటే గత ఆర్థిక సంవత్సరం వరకు రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు పేరిట దాదాపు రూ.7,500 కోట్ల వరకు ప్రభుత్వం ఆయా కళాశాలలకు చెల్లించాల్సి ఉంది. అందులో సగానికిపైగా ఇంజినీరింగ్ కళాశాలలకే చెల్లించాల్సి ఉంది. ప్రముఖ కళాశాలల్లో 10 వేల లోపు ర్యాంకర్లు ప్రవేశాలు పొందుతారు. వారికి పూర్తి ఫీజు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన కళాశాలల్లో రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ పేరిట చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని విద్యార్థులే కడతారు.
ఈ కారణంగా టాప్ కళాశాలలకు భారీగా బకాయిలు ఉండటంతో ఏమి చెయ్యాలో తెలియక సతమతమవుతున్నాయి.. ఇందులో పేద, మధ్యతరగతి విద్యార్థులు బలిపశువులు అవుతున్నారు.. దాదాపు మూడేళ్ల బకాయిలు పేరుకుపోవడంతో బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించడం కళాశాలలకు కష్టంగా మారింది. హైదరాబాద్ శివారులోని ఓ కళాశాల ఏప్రిల్ నెల వేతనం సగమే ఇచ్చింది. ప్రభుత్వం నుంచి బోధనా రుసుములు వచ్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇస్తామని చెప్పింది. నగరంలో నాలుగు దశాబ్దాల క్రితం నెలకొల్పిన మరో కళాశాలకు రూ.60 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. యాజమాన్య కోటా సీట్లను సైతం మెరిట్ ఆధారంగా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుకు కేటాయించే ఆ కళాశాల ఇప్పుడు నెలనెలా జీతాలు చెల్లించేందుకు ఇబ్బందిపడుతోంది. ఇక చిన్న కళాశాలలు అయితే నెలల తరబడి వేతనాలు ఇవ్వడం లేదు.

ఈ విధంగా మిగతా కళాశాలలు కూడా పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నాయి’ అని ఓ ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ చెప్పారు. తమకు కూడా బకాయిలు విడుదల చేయాలని ఫార్మసీ కళాశాలల సంఘం తరఫున ఇటీవల పిటిషన్ దాఖలు చేశామని, విచారణకు రావాల్సి ఉందని తెలిపారు.. ‘ఇప్పటికే మూడేళ్ల బకాయిలున్నాయి. కనీసం కొత్త విద్యా సంవత్సరం అంటే 2025-26 నుంచైనా రీయింబర్స్మెంట్ను విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయాలి. వారి నుంచి ఫీజు మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు మాకు అనుమతివ్వాలి’ అని కళాశాలల యాజమాన్యం ఇటీవల ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది.. ఈ క్రమంలో ఇటు విద్యార్థుల తరఫున.. అటు కళాశాలల యాజమాన్యం తరఫున కూడా న్యాయ పోరాటం చేయాలని "కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ", " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " భావిస్తోందని సంస్థ ప్రతినిధి ఒకరు తెలియజేశారు..