ఆగస్టు 15 నాటికీ భూసమస్యలు పరిష్కరించాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పేదవాడికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో , జూలై 22: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల భూసమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
మంగళవారం హైదరాబాదులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా నిర్వహించిన రెవెన్యూసదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు.రెవెన్యూ సదస్సులను వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, ఆగస్టు 15 నాటికి వీలైనన్ని సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పేదవాడికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని స్పష్టం చేశారు. ధరల నియంత్రణ కమిటీలు చురుగ్గా పనిచేసేలా చూడాలని, ఇసుక, స్టీల్, సిమెంట్ సరఫరాలో ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులెవరికి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు. యూరియా ఇతర ఎరువుల కొరత రాకుండా చూడాలని తెలిపారు.
లబ్ధిదారుల జాబితాతో సంబంధం లేకుండా నిరుపేదలైతే ఇల్లు కేటాయించాలని మంత్రి ఆదేశించారు. అనంతరం అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, వన మహోత్సవం కార్యక్రమాన్ని త్వరితగతిన ముగించాలని అన్నారు. నిర్దేశించిన మొక్కల ను ఖచ్చితంగా నాటాలని అన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మాహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ విజయవంతంగా కొనసాగుతుందని, ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు ప్రయాణించిన సందర్బంగా 97 డిపోలు, 321 బస్స్టేషన్లలో వేడుకలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టానున్నామని తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన ఆహార పంపిణీ, వారంలో ఒకరోజు అధికారులు బస చేయాలని సూచించారు.
అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సమీక్షిస్తూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి గ్రౌండింగ్ చేపట్టిన వారు, ఇంటి నిర్మాణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో వేగం పెంచాలని అన్నారు. ఆగస్టు 15 వ తేదీ లోపు భూ సమస్యలను అన్నింటిని భూ భారతి చట్టాన్ని అనుసరించి పరిష్కరించాలని అన్నారు. నోటీసులు జారీ చేసిన దరఖాస్తుదారుల భూ సమస్యలపై విచారణ జరపాలని పేర్కొన్నారు. ఈ నెల 25 వ తేదీ నుంచి ఆగస్టు 10 వరకు అన్ని గ్రామాలలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని అన్నారు. దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ అర్హులైన ప్రజలందరికీ అందేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతులకు సరిపడినంత యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎరువులు పక్కదారి పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, జెడ్పి సీఈవో గోవింద్, డీఈఓ పి. రామారావు, డిపిఓ శ్రీనివాస్, డిఎంహెచ్ఓ రాజేందర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు రాజేశ్వర్ గౌడ్, అంబాజీ శ్రీనివాస్, మోహన్ సింగ్, ఎక్సైజ్ అధికారి ఎం.ఎ. రజాక్, హౌసింగ్ పిడి రాజేశ్వర్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.