సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా పనిచేయాలి:

ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపు.

సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా పనిచేయాలి:

హైదరాబాద్:

ప్రజా సేవలో అంకితభావంతో పనిచేస్తూ, సమాజ ప్రగతికి యువ అధికారులు బాటలు వేయాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. సోమవారం లోక్ భవన్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంఆర్సి, హెచ్ఆర్డి)లో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్-1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా అధికారులను అభినందించిన ఆయన, పరిపాలనాంశాలపై దిశానిర్దేశం చేశారు.

బాధ్యతాయుతంగా పనిచేయడమే అసలైన పరిపాలన
ప్రొబేషనరీ అధికారులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ, పదవి అనేది కేవలం అధికారం మాత్రమే కాదని, అదొక సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు.

 ప్రజా సంక్షేమమే లక్ష్యం:
 ప్రతి ప్రభుత్వ నిర్ణయంలోనూ సామాన్యుడి సంక్షేమమే ప్రధాన అజెండాగా ఉండాలి.

 నిజాయితీయే బలం: పరిపాలనలో పారదర్శకత, నిజాయితీ ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతాయి.
 
సున్నితత్వం: కార్యాలయానికి వచ్చే ప్రతి పౌరుడి సమస్యను మానవీయ కోణంలో అర్థం చేసుకుని, తగిన పరిష్కారం చూపాలి.
ఈ కార్యక్రమంలో ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ సంస్థ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ శాంతి కుమారి, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి శశికిరణా చారి పాల్గొన్నారు.

సరస్వతీ అంత్య పుష్కరాలకు గవర్నర్‌కు ఆహ్వానం:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరవ్వాలని దేవాదాయ శాఖ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఆహ్వానించింది. మంత్రి కొండా సురేఖ, ఆలయ అర్చకులు లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

ఈఏపీసెట్ టాపర్ మల్లాడి రుషికి అభినందనలు:
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థిని మల్లాడి రుషిని గవర్నర్ సోమవారం లోక్ భవన్‌లో ప్రత్యేకంగా అభినందించారు. రుషి సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె పట్టుదలతో పాటు, ఈ విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా గవర్నర్ ప్రశంసించారు.

గవర్నర్‌ను కలిసిన గిగ్ కార్మికుల సంఘం:
తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ నేతృత్వంలో పలువురు ప్రతినిధులు సోమవారం లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.WhatsApp Image 2026-05-18 at 18.59.30

About The Author