పిడిఎస్ యు ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం.
చేవెళ్ల, భారత శక్తి ప్రతినిధి, జూలై 23: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేవెళ్ల మండలంలోని అంతారం, ఆలూర్, తంగడిపల్లి, మడికట్టు గ్రామాలలో మరియు చేవెళ్ల మండల కేంద్రంలో , ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బంద్ నిర్వహించినట్లు వామపక్ష, పి.డి.ఎస్.యు విద్యార్థి సంఘాల నాయకులు డివిజన్ ప్రధాన కార్యదర్శి బొజ్జి శ్రీకాంత్, న్యాలట అశోక్, పాండు, అన్నారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు చేవెళ్ల డివిజన్ ప్రధాన కార్యదర్శి బొజ్జి శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తామని చెప్పి తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందనీ అన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి దిక్కులేడని తక్షణమే నియమించాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డీఈవో పోస్టులను భర్తీ చెయ్యాలనీ డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలనీ, పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలనీ అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించి, నిధులు కేటాయించాలనీ కోరారు.
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలనీ, సంక్షేమ హాస్టల్ తో పాటు గురుకులాలకు సొంతభవనాలు నిర్మాణం చేయాలి, ప్రతి మండలంలో గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి, విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు ఇవ్వాలనీ,నూతన జాతీయ విద్యా విధానాన్నీ తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు, నాయకులు, న్యాలట అశోక్, పాండు, విద్యార్థులు పాల్గొన్నారు.