పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితిసింగ్
కడప, జూలై 15(భారత శక్తి) : రాష్ట్రంలోని పేదరికాన్ని రూపు మాపడమే లక్ష్యంగా, స్వర్ణ ఆంధ్ర @ 2047 విజన్ప్లాన్లో భాగంగా ప్రభుత్వం పి4 విధానాన్ని రూపొందించిందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితిసింగ్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలో పి4 సర్వే నిర్వహణపై.. జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ ఆధ్వర్యంలో పి24 నిర్వహణపై రాష్ట్ర సమగ్ర టీమ్ ప్రతినిధి సాయి సాత్విక్ పవర్ పాయింట్ ద్వారా అధికారులకు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే బంగారు కుటుంబాలను ప్రాథమికంగా సర్వే ద్వారా గుర్తించడం జరిగిందన్నారు. అందుకు సంబంధించి తుది జాబితాను తయారు చేసేందుకు గ్రామ వార్డు సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామసభల నిర్వహణకు 17వ తేదీ లోపు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి.. ఈ నెల 18 నుండి ఆగస్టు 5వ తేదీ వరకు సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి మాస్టర్ ట్రైనర్ల ద్వారా ఈనెల 17, 18వ తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలు మేరకు జిల్లాలో ఇప్పటికే జిల్లాలో 78 వేల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు. స్వర్ణాంధ్ర జీరో ప్రావర్టీ - పి 4 (పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్ట్ నర్ షిప్) ద్వారా ఎంపిక చేసిన బంగారు కుటుంబాల జాబితాను మరోసారి పునః పరిశీలన చేసి, మార్పులు చేర్పులతో తుది జాబితాను తయారు చేయనున్నట్లు తెలిపారు. దీనికోసం సచివాలయ సిబ్బంది ద్వారా గ్రామాలు, వార్డుల్లో జులై 17 నుండి ఆగస్టు 5 లోపల గ్రామసభలను నిర్వహించి తుది జాబితాను తయారు చేయడం జరుగుతుందన్నారు. ఆగస్టు 10 నాటికి తుది జాబితాలో ఉన్న బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ సర్వేలో ప్రతి రోజు కీ పర్ఫార్మెన్స్ ఇండికెటర్ నివేదికను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. మార్గదర్శుల సహాయ సహకారాలతో బంగారు కుటుంబాలను కూడా ఉన్నత స్థానానికి తీసుకుని రావడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. బంగారు కుటుంబాలను ఆర్థికంగానే కాకుండా చదువు, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి చేసేందుకు మార్గదర్శులు తోడ్పాటును అందిస్తారని తెలిపారు. కార్యక్రమాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి రూట్స్, యాప్ ద్వారా వివరాలను సేకరించి దిగ్విజయం చేయాలని ఇంచార్జి కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కేఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, జమ్మలమడుగు, బద్వేలు ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, సీపీవో హజరతయ్య, డిఆర్డీఏ, డ్వామా పీడీలు రాజ్యాలక్షి, ఆది శేషారెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్ర నాయక్, పరిశ్రమల శాఖ జిఎం చాంద్ బాషా, డిపిఓ ఏవో ఖాదర్ బాషా, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.