ఆరోగ్య శాఖలో అవినీతి అనారోగ్యం..
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
- అమాయకుల ప్రాణాలతో ఆటలాడుతున్న అత్యున్నత వ్యవస్థ..
- లంచాల మత్తుతో ఐసీయూలో పడుకున్న అధికారగణం..
- మెడికల్ మాఫియాతో అంటకాగుతున్న దుర్మార్గం..
- నకిలీ మందులు, నకిలీ వైద్యాల పరంపర..
- కార్పొరేట్ వైద్య సంస్థలకు వంతపాడుతున్న ప్రభుత్వాలు..
- ప్రభుత్వ వైద్యాన్ని అటకెక్కించిన దౌర్భాగ్యం..
- బ్రతికే హక్కును కోల్పోతున్న సామాన్యులు, నిరుపేదలు..
- ప్రభుత్వ డాక్టర్లకు లక్షల్లో జీతాలిస్తూ.. అలక్ష్యంతో నిర్వహణ..
- గవర్నమెంట్ ఆసుపత్రి అంటేనే పారిపోతున్న ప్రజానీకం..
- కమిటీలు, కమిషన్లు, లక్షల్లో కలెక్షన్లు ఇదే ప్రస్తుత పరిస్థితి..
- తీవ్రమైన అనారోగ్యం ఏర్పడితే.. ఆస్థులు అమ్ముకోవాల్సిందే..
- ఎన్నో దేశాల్లో వైద్యం ఉచితం.. మనకేమో ఇది పెద్ద ప్రసహనం..
- అవినీతిలో కూరుకుపోయిన వైద్యశాఖ ప్రక్షాళన కోసం పోరాటం సాగిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
వైద్యం ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కు.. కానీ ఆ హక్కును కాలరాస్తున్నారు కొందరు అవినీతి వైద్యశాఖ అధికారులు, ఉద్యోగులు.. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే.. అడుగడుగునా లంచాలు ఇవ్వాల్సిందే.. ఏదైనా అత్యవసరం అయితే అక్కడ విధులు నిర్వహించే వైద్యులు నడుపుతున్న ప్రవేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్షలు చెల్లించాల్సిందే.. తగిన సౌకర్యాలున్నా వాటిని ఉపయోగించడంలో కొందరు వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.. ప్రజలు కట్టే పన్నులతో లక్షల్లో జీతాలు తీసుకుంటున్న డాక్టర్లు.. అవి సరిపోవన్నట్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు.. జలగల్లా పీడిస్తూ జనాలను దోచుకుంటున్నారు.. ప్రభుత్వాలు సైతం వీరిపట్ల ఉదాసీనత ప్రదర్శిస్తుండటంతో వారిని నిలువరించేవారు లేక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నకిలీ మందులను రోగులకు ఇస్తున్నారు.. అసలు మందులను దారిమళ్లిస్తున్నారు.. మెడికల్ మాఫియాతో చేతులు కలిపిన ప్రభుత్వ వైద్యులు తమ బాధ్యతలను అక్రమ సంపాదనకు అమ్ముకుంటున్నారు.. ఇక ఎలాంటి నిబంధనలు పాటించకుండా నడుస్తున్న ప్రైవేట్ వైద్యశాలలను అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు.. ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగి ఆహుతైన ఎన్నో ప్రాణాలు.. అలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా వీరికి పట్టదు.. కార్పొరేట్ వైద్యం కర్కశంగా వేస్తున్న విషపు కాట్లు అమాయకుల జీవితాలను అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేస్తున్నాయి.. ధన్వంతరి వారసులం అని చెప్పుకుంటున్న వైద్యులు సిగ్గుతో తలదించుకోవాలి.. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి.. మహోన్నతమైన ఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు, డాక్టర్లు ఇసుమంతైనా ఇంగితజ్ఞానం తెచ్చుకుని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఆరోగ్య శాఖ అత్యంత కీలకమైనది. సాధారణంగా ఒక దేశం అభివృద్ధి స్థాయిని కొలవడంలో ఆరోగ్య సదుపాయాల నాణ్యత ప్రధాన ప్రమాణంగా పరిగణిస్తారు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, మన దేశంలోనే కాదు, ముఖ్యంగా తెలంగాణ ఆరోగ్య శాఖలో అవినీతి ఒక మహమ్మారిలా వ్యాపించింది. ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు, నేరుగా ప్రాణాలపై ప్రభావం చూపించే ఒక మానవతా సంక్షోభం.
ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు కొనుగోలు చేసే సమయంలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాణ్యత లేని ఔషధాలను అధిక ధరలకు సరఫరా చేస్తున్నారు. ఈ ఔషధాలు రోగులకు ఉపయోగం లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులవైపు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది..
పరికరాల కొనుగోళ్లలో కూడా ఇదే దృశ్యం కనిపిస్తోంది.. కోట్ల రూపాయల విలువ చేసే పరికరాలు సరఫరా అవుతాయి కానీ అవి పని చేయక మూల గదుల్లో మృత వస్తువుల్లా పడి ఉంటాయి. చివరికి నష్టపోయేది పేద ప్రజలే.
ఇక నియామకాల్లో అంతులేని అవినీతి :
డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ల నియామకాలలో లంచం ప్రధాన ప్రమాణంగా మారింది. ఫలితంగా అర్హులైనవారు అవకాశాలు కోల్పోతున్నారు. అనర్హులు పదవులు సంపాదించి రోగులకు సరైన చికిత్స ఇవ్వలేకపోతున్నారు. ఒక వైపు ఉద్యోగ రాహిత్యం, మరో వైపు అనారోగ్యం.. ఈ రెండింటి భారం సాధారణ ప్రజలపైనే పడుతోంది.
పథకాల దుర్వినియోగం :
ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పేదలకు వరంలా ఉండాలి. కానీ అవినీతిపరుల చేతుల్లో లూటీ చెయ్యడానికి అనువైన సాధనాలుగా మారాయి. బోగస్ రోగులను చూపించి.. తప్పుడు బిల్లులు వేసి.. కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. ఫలితంగా నిజంగా అవసరమైన వారికి ఆ సాయం చేరడం లేదు.
ఈ అవినీతి ప్రజలపై అత్యంత ప్రభావం చూపుతోంది :
ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం దెబ్బతినడం.. ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడాల్సి రావడం.. పేదలపై ఆర్థిక భారం పెరగడం నాణ్యమైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోవడం.. ఈ ప్రభావం కేవలం వ్యక్తులకే పరిమితం కాదు. దేశం మొత్తానికీ ఇది ఒక ఆరోగ్య సంక్షోభంగా మారుతుండటం ఆందోళన కల్గించే విషయం..
ముఖ్యమైన పరిష్కార మార్గాలు :
ఆరోగ్య శాఖలో అవినీతిని అరికట్టాలంటే కఠిన చర్యలు తప్పనిసరి. పారదర్శక ఈ -టెండర్లు తప్పనిసరి చేయాలి. స్వతంత్ర ఆడిట్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. విజిల్బ్లోయర్లకు రక్షణ కల్పించాలి. ప్రతి ఆసుపత్రిలో సోషల్ ఆడిట్లు అనుమతించాలి. అవినీతి నిరూపితమైన వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలి.
చివరగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. ఆరోగ్య రంగంలో అవినీతి అనేది కేవలం ఆర్థిక నష్టం కాదు; ఇది ప్రాణహత్యతో సమానం. ఒక డాక్టర్ చేతిలో ఉన్న ప్రాణం, ఒక ఆసుపత్రి నడవాల్సిన బాధ్యత.. ఇవి నేరుగా అవినీతి వలలో చిక్కుకుంటే, సమాజం మొత్తమే దెబ్బతింటుంది. అందువల్ల ఆరోగ్య శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలి. ప్రజల ఆరోగ్యం రక్షించడం ప్రభుత్వ ధర్మం. అది విఫలమైతే, మనం సమాజంగా విఫలమైనట్టే.. సమసమాజం కోసం ఆరోగ్యశాఖ అవినీతిపై పోరాటం సాగిస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థతో చేతులు కలపండి "..